హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కంపెనీల్లాగే దక్కన్ క్రానికల్: మీడియా వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Deccan Chronical Logo
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు తమను దారుణంగా వంచించారని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో లేని షేర్లను ఉన్నట్టుగా నమ్మించేందుకు తమ పేరుతో పత్రాలను ఫోర్జరీ చేశారని దక్కన్ క్రానికల్ ప్రమోటర్లపై కార్వీ కేసు పెట్టింది.

ఈ పత్రాలను చూపించి లేని షేర్లను ఉన్నట్టుగా నమ్మించి షేర్ల తాకట్టుపేరుతో పైనాన్షియల్ సర్వీసుల సంస్థ ఫ్యూచర్ కాపిటల్‌ను దాదాపు రూ.170 కోట్ల మేరకు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు టి.వెంకట్రామ్‌రెడ్డి, టి.వినాయక్ రవి రెడ్డి, పికె అయ్యర్ మోసగించారని కార్వీ ఆరోపించింది. సత్యం కంప్యూటర్స్, జగన్ కంపెనీ ల పరంపరలో ఇప్పుడు దక్కన్ క్రానికల్ చేరిందని మీడియా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దక్కన్ క్రానికల్ వ్యవహారంపై వచ్చిన మీడియా వార్తలను క్రోడీకరిస్తే సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రమోటర్ల దగాపై కార్వీ ఉద్యోగి ఉమామహేశ్వర్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ సెంట్ర ల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులోని మూడు సంస్థలు దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, కార్వీ గ్రూప్, ఫ్యూచర్ కాపిటల్ దేశీయ కార్పొరేట్ రంగంలో పేరున్నవి కావడం విశేషం.

కార్వీ ఫిర్యాదు పత్రం, కోర్టులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... దక్కన్ క్రానికల్ హోల్డింగ్ ప్రమోటర్లు ఉమ్మడిగా కంపెనీ ఈక్విటీలో 54 శాతం షేర్లను తాకట్టుపెట్టి ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ ఫ్యూచ ర్ కాపిటల్ నుంచి రూ.170 కోట్లు సమీకరించారు. ఇందులో రూ.150 కోట్లు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు, మిగిలిన రూ.20 కోట్లు ఎవియోటెక్ ప్రమోటర్లు (వారూ వీరు ఒక్కటే) తీసుకున్నారు.

స్టాక్ బ్రోకింగ్, డిపాజిటరీ సర్వీసుల్లో ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌లోని తమ డీమ్యాట్ ఖాతాల్లో మొత్తం 11,28,51,000 డీసీహెచ్ఎల్ షేర్లు (కంపెనీ ఈక్విటీలో 54 శాతం వాటాకు సమానం) ఉన్నట్టు ఫ్యూచర్ కాపిటల్‌కు తెలియజేశారు. తాకట్టు కారణంగా ఈ షేర్లను ఫ్యూచర్ కాపిటల్ ఆమోదం లేకుండా వేరొకరు తాకే వీల్లేదు. దక్కన్ క్రానికల్ ప్రమోటర్లతో తమ డీల్ గురించి వెల్లడిస్తూ, వారి డీమ్యా ట్ ఖాతాల్లోని షేర్ల వివరాలను తెలియజేయాలని, ఫ్యూచర్ కాపిటల్ పేరిట తయారుచేసిన నాన్ డిస్పోజల్ -పవర్ ఆఫ్ అటార్నీ (ఎన్‌డియు-పీవోఏ)పై కౌంటర్ సైన్ చేయాలని కోరుతూ కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు ఫ్యూచర్ కాపిటల్ లేఖ రాసింది.

ఆనాటికి ఈ ముగ్గురి డిపాజిటరీ ఖాతాల్లో నికరంగా 6,04,50,000 దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు మాత్రమే ఉన్నాయి. వారు కోరినట్లు ఎన్‌డీయు-పీవోఏపై సంతకాలు చేస్తూ, ఇవే వివరాలను ఫ్యూచర్ కాపిటల్‌కు కార్వీ తెలియజేసింది. తర్వాత కొద్దిరోజులకు మే 28న దక్కన్ క్రానికల్ ప్రమోటర్ల డిపాజిటరీ ఖాతాల్లో షేర్ల సంఖ్య పెరిగిందా లేదా చెప్పాల్సిందిగా కోరుతూ ఫ్యూచర్ కాపిటల్ నుంచి మరో లేఖ కార్వీకి అందింది. ఈ విషయం దక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు తెలియజేస్తూ వెంటనే డిపాజటరీ ఖాతాల్లోకి అవసరమైన షేర్లను బదిలీ చేయాల్సిందిగా కార్వీ సూచించింది.

అయితే ఆ అవసరం లేదని ఫ్యూచర్ కాపిటల్‌తో ఒప్పందం రద్దైనందున, కార్వీ సంతకం చేసిన నాన్ డిస్పోజల్ అండర్‌టేకింగ్-పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ కూడా రద్దైనట్టేనని దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు తెలియజేశారు. దీనికి సంబంధించిన పత్రాలు త్వరలోనే కార్వీకి అందుతాయని నమ్మబలికారు. కంపెనీ స్థాయి, ప్రమోటర్ల అంతస్తు, ట్రాక్ రికార్డు దృష్ట్యా వారి మాటలను కార్వీ విశ్వసించింది. కార్వీని నమ్మించిన దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు, తమ షేర్లలో కొంతభాగాన్ని రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ అనే మరో సంస్థలోని తమ డిపాజిటరీ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. మరికొన్నిటిని ఐడీఎఫ్‌సీకి తాకట్టు పెట్టి కొత్త రుణాలు తీసుకున్నారు. తాకట్టు తొలగిందన్న భావనతో వారు కోరినట్లు షేర్ల బదిలీకి కార్వీ అనుమతించింది.

కానీ, ఫ్యూచర్ కాపిటల్‌తో ఒప్పందం రద్దు, పవర్ ఆఫ్ అటార్నీ రద్దుకు సంబంధించిన పత్రాలు జూలై రెండో వారందాకా అందకపోవడంతో కార్వీ మళ్లీ మళ్లీ దక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు లేఖలు రాసింది. వారి నుంచి సమాధానం లేదు. ఈ లోగా జూలై 17న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు ఫ్యూచర్ కాపిటల్ నుంచి మరో లేఖ అందింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో వెంకట్రామ్‌రెడ్డి, వినాయక్ రవిరెడ్డి, పికె అయ్యర్ పేరుతో ఉన్న డిమ్యాట్ ఖాతాల్లోని మొత్తం 11,28,51,000 డిసిహెచ్ఎల్ షేర్ల ను తమకు తాకట్టు పెట్టినందున ఈ షేర్లపై అధికారం తమకే ఉందని ఆ లేఖలో ఫ్యూచర్ కాపిటల్ పేర్కొంది.

ఈ లేఖతో పాటు ఈ మూడు ఖాతాల్లో ముందుగా ఉన్న 6,04,50,000 షేర్లకు తోడుగా ప్రతి ఖాతాలోనూ అదనంగా 1,74,67,000 షేర్లు (మొత్తం 5,24,01,000 షేర్లు) జమైనట్టు కార్వీ రాసిన లేఖ ప్రతిని కూడా ఫ్యూచర్ కాపిటల్ జత చేసింది. దీంతో కార్వీకి దిమ్మతిరిగింది. ఈ లేఖ తాము రాయనేలేదని పేర్కొంటూ వివరణ ఇవ్వాల్సిందిగా దక్కన్ క్రానికల్ ప్రమోటర్లను నిలదీసింది.

ఆ ఖాతాల్లో షేర్లు పెరగకపోగా ఉన్న షేర్లు కూడా తరిగిపోవడంతో కార్వీ బెంబేలెత్తింది. డిసి ప్రమోటర్ల వివరణ కోరుతూ జూలై 20న లేఖ రాసింది. వారి నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డీసీహెచ్ఎల్ షేరు ధర బుధవారం నాడు 13.95 రూపాయల కనిష్ఠస్థాయిని తాకింది. గతంలో కంపెనీలు వాటాదారులకు కాగితంపై ముద్రించిన షేర్ సర్టిఫికెట్లను (ఫిజికల్) అందజేసేవి. ఇప్పుడు వాటి స్థానే ఇ-సర్టిఫికెట్స్ వచ్చాయి. డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌గా ఉన్న సంస్థల్లో ఖాతాలు తెరిచి వాటిలో ఇ-షేర్లను నిల్వచేస్తారు. స్టాక్ మార్కెట్ క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున ఈ షేర్ల బదిలీ కూడా ఆన్‌లైన్‌లోనే ఒక ఖాతాలోంచి మరో ఖాతాలోకి జరుగుతుంది.

కార్వీ ఫిర్యాదును బట్టి ఫ్యూచర్ కాపిటల్ దగ్గర తాకట్టుపెట్టినట్టు చెబుతున్న 54శాతం వాటాలు ఫ్యూచర్ కాపిటల్ దగ్గరలేవు. అవి ఏమైనట్టు? ఈ కేసులో ఫ్యూచర్ కాపిటల్ స్పందన ఇంతవరకు తెలియలేదు. దక్కన్ క్రానికల్ ప్రమోటర్ల చేతుల్లో రూ. 170 కోట్ల మేర మోసపోయిన ఫ్యూచర్ కాపిటల్ ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటన చేయలేదు.

దక్కన్ క్రానికల్‌లో ముగ్గురు ప్రమోటర్లకు 73.8 శాతం వాటా ఉంది. కార్వీ ఫిర్యాదులోని అంశాల ప్రకారం రెలిగేర్‌వద్ద తాకట్టు పెట్టిన షేర్లు కూడా దక్కన్ క్రానికల్ ప్రమోటర్లవేనని అర్ధం అవుతోంది. ఈ షేర్లు 14 శాతం మాత్రమే. వీరికి ఎన్ని సంస్థల్లో డిమ్యాట్ ఖాతాలున్నాయి. వాటిలో నిల్వ ఉన్న షేర్లు ఎన్ని? తాకట్టులో ఉన్న షేర్ల మొత్తం ఎంత? ఫ్రీగా ఉన్న షేర్లు ఎన్ని? తాకట్టు పేరుతో వారు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల నుంచి సమీకరించింది ఎంత? కార్వీని, ఫ్యూచర్ కాపిటల్‌ను మోసగించినట్టే ఇతర సంస్థల్లోనూ ఇలాంటి దందా జరిగిందా? ఈ ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉంది.

మరోవైపు ఈ మొత్తం ఉదంతంపై సెబి, కంపెనీ వ్యవహారాల మం త్రిత్వ శాఖ కూడా దృష్టి సారించినట్టు చెబుతున్నారు. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు స్థానిక అధికారులనుంచి నివేదిక కోరినట్టు తెలిసింది. రానున్న రెండుమూడు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

English summary

 The complaint was filed by representatives of Karvy against the three promoters - DCHL chairman T Venkattram Reddy as well as the company's vice chairmen T Vinayak Ravi Reddy and PK Iyer -- at the Central Crime Station, Hyderabad, on Tuesday. The FIR lodged by the police invokes sections 420, 406, 458 and 471 read with Section 34 of IPC. Some of the sections are non-bailable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X