గల్లా జయదేవ్: చిరు స్థానం కోసం మహేష్బాబు

అయితే జయదేవ్ తిరుపతి టిక్కెట్ దక్కించుకోవడానికి హీరో మహేష్ బాబు పేరునూ ఉపయోగించుకుంటున్నారట. పార్టీ పెద్దల వద్ద ఆయన ప్రధానంగా హీరో మహేష్ బాబు పేరును ప్రస్తావిస్తున్నారట. నియోజకవర్గంలో సర్వే చేశానని, తన గెలుపు ఖాయమని అధిష్టానానికి ఆయన చెబుతున్నారు.
మహేష్ బాబుతో తనకు ఉన్న బంధుత్వాన్ని ఆయన పార్టీ పెద్దలకు చెబుతున్నారు. తిరుపతి నియోజకవర్గంలో మహేష్ బాబు అభిమానుల సంఖ్య రిజిస్టర్ అయిన వారే దాదాపు ఇరవై వేలకు పైగా ఉన్నారని, అది తిరుపతి ఓటర్లలో దాదాపు ఎనిమిదో వంతు అని ఆయన చెబుతున్నారట. అంతేకాకుండా తన పరిశ్రమ అమరరాజా బ్యాటరీస్లో పని చేసే వేలమంది ఉద్యోగుల కుటుంబాలు తిరుపతిలో ఓటర్లుగా ఉండటం తనకు కలిసి వస్తుందని, అదే తనకు ప్రధాన బలమని ఆయన పార్టీ పెద్దలకు చెబుతున్నారు.
బుధవారం ఉదయం జయదేవ్ ఏఐసిసి కార్యాలయానికి వెళ్లి అక్కడ పార్టీ నాయకులను కలిశారు. కేంద్రమంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్, వయలార్ రవి, అహ్మద్ పటేల్ తదితరులను కలిశారు. తనకు సీటిస్తే కచ్చితంగా గెలుస్తానని జయదేవ్ అధిష్ఠానం పెద్దలకు విశ్వాసంగా చెబుతున్నారు. సోనియాగాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. తిరుపతి నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే, తనకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన విశ్వాసంగా చెబుతున్నారు.
మహేష్ అభిమానుల ఓట్లు, తన కంపెనీ కుటుంబాల ఓట్లు, కొత్తగా ఓటర్ల జాబితాలో నమోదైన ఓట్లు ఇలా తను ఖచ్చితంగా ఎలాగెలుస్తానో అనే సర్వే వివరాలతో కూడిన నివేదికను కాంగ్రెస్ పెద్దలకు జయదేవ్ అందిస్తున్నారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువత ఐదు శాతం ఉందని, పైగా, పట్టణ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న తిరుపతిలో కులానికంటే కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారికే ఎక్కువగా పట్టం కడుతున్నారని ఆయన అధిష్టానానికి చెబుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు కాగా, తిరుపతి నియోజకవర్గంలోని చిరంజీవి అభిమానులు, రాజకీయ కార్యకర్తలు కూడా తన గెలుపునకు సహకరిస్తారని ఆయన పూర్తి వివరాలతో కూడిన అంశాలను అధిష్టానం ముందు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications