పార్టీ - పార్టీ నడుమ కోదండరామ్
మంగళవారం సమావేశమైన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆవశ్యకతను గుర్తించింది. రెండు పార్టీల మధ్య విభేదాలు తెలంగాణవాదానికి నష్టం చేసే ప్రమాదం ఉందని తెలంగాణ జెఎసి అభిప్రాయపడుతోంది. డిసెంబర్ 1వ తేదీన తలపెట్టిన విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశానికి జెఎసి రెండు పార్టీలను కూడా ఆహ్వానించింది.
ఎన్నికల రాజకీయాల్లో ముందుండాలనే ఉద్దేశంతో పనిచేస్తుండడం వల్ల ఇరు పార్టీల మధ్య వైరం పెరిగిందని, జెఎసిలో రెండు పార్టీలు కూడా సభ్యులేనని, అందువల్ల రెండు పార్టీలను కలపాల్సిన బాధ్యత తమపై ఉందని తెలంగాణ జెఎసి నాయకులు అంటున్నారు. విస్తృత స్థాయి సమావేశానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, బిజెపి సీనియర్ నేతలు జి. కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర రావు హాజరవుతారని తెలంగాణ జెఎసి నమ్ముతోంది.
ఇప్పటికే ఇరు పార్టీల నాయకులకు సర్దిచెప్పే పనిని తెలంగాణ జెఎసి ఇప్పటికే చేపట్టింది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేయాలని తెలంగాణ జెఎసి సీనియర్ నాయకులు ఆ పార్టీల నాయకులకు చెప్పారు. తెరాస కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుందనే అనుమానాలను బిజెపి వ్యక్తం చేస్తోంది.