నాయకత్వ మార్పు: సీటు కోసం పోటాపోటీ
దీంతో.. తమ అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం ముందుంచాలన్న భావన నేతల్లో పెరిగింది. ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రిలో ఆత్మ విశ్వాసం పెరిగినట్లుగా కనిపిస్తోందని.. నాయకత్వ మార్పునకు ఆస్కారం కన్పించడం లేదని కొందరు మంత్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం పార్లమెంటు సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యవహారాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని అంతే ధీమాతో చెబుతున్నారు. అయితే కొందరు సీనియర్ మంత్రులు మాత్రం ఇదంతా రాష్ట్ర నాయకత్వం స్వయంకృతమని అంటున్నారు.
రాష్ట్రంలో జోడెద్దుల్లా ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు నడిపించాల్సిన కిరణ్, సత్తిబాబులు అధిష్ఠానానికి ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకొన్నారని అంటున్నారు. రాష్ట్ర వ్యవహారాలపై హైకమాండ్ ఒక నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చేందుకు వారిద్దరూ దోహదపడ్డారని అంటున్నారు. సిఎం ఏం చేస్తున్నారో.. పిసిసి చీఫ్ ఎలా వ్యవహరిస్తున్నారో.. మంత్రుల పనితీరు ఎలా ఉందో.. అనే వాటిపై ఏఐసిసి వద్ద పూర్తి స్థాయి నివేదికలు ఉన్నాయని సీనియర్ మంత్రి ఒకరు చెప్పారు. పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడం తప్ప.. ప్రత్యామ్నాయం చూసుకున్నామంటూ అధిష్ఠానం ఏప్పుడూ నేరుగా చెప్పదని అన్నారు.
ఇదే సమయంలో నాయకత్వ మార్పునకు, తెలంగాణ అంశానికి లంకె ఉందని రాష్ట్ర మంత్రులు కొందరు చెబుతున్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని సిఎం, పిసిసి చీఫ్ల సహా, ప్రత్యేక రాష్ట్రం కాంక్షిస్తున్న వారు, సమైక్యాంధ్రను కోరుకుంటున్న వారు కూడా కోరుకుంటున్నారని వివరించారు. తెలంగాణపై అధిష్ఠానం ఏ నిర్ణయం వెల్లడించకుండా నాయకత్వ మార్పునకు సిద్ధపడితే.. ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం కావని వారి వాదన. అయితే దీంతో మరికొందరు విభేదిస్తున్నారు.
నాయకత్వ మార్పుపై ఇటీవల 18 శాసనసభ, నెల్లూరు లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాతే.. అధిష్ఠానం కచ్చితమైన అభిప్రాయానికి వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో సీఎం రేసులో ఉన్న ఉప ముఖ్యమంత్రి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో గురువారం పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం రాత్రి డిఎస్తో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఉప్పు.. నిప్పుగా ఉన్న కిరణ్, సత్తిబాబులు మంగళవారం రాత్రి భేటీ అయి.. ఏకాంతంగా చర్చించుకోవడంపై కాంగ్రెసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.