మజ్లీస్ ఎఫెక్ట్: ఎర్లీ పోల్స్కు జగన్ వ్యూహం?
మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో, ప్రభుత్వాన్ని కూల్చి త్వరగా ఎన్నికలు తీసుకువచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. తన ప్రకటనల ద్వారా తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచి, అవిశ్వాస తీర్మానం పెట్టించాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మునుపటి మాదిరిగా తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టి వ్యూహాత్మకంగా ఆ పార్టీ తో అవిశ్వాస తీర్మానం పెట్టించేలా పావులు కదుపు తోంది. మజ్లీస్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం వెనక వైయస్ జగన్ పాత్ర ఉందనే ఊహాగానాలు కూడా ఈ స్థితిలోనే చెలరేగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ రెైతు విధానాలను విమర్శిస్తూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు నిజంగా ప్రభుత్వం పడిపోవాలని భావిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టి, తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కిరణ్ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, వారిద్దరి మ్యాచ్ ఫిక్సింగ్కు అది నిదర్శనమని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదని నిరూపించుకోవడానికి చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే ఎప్పుడో అవిశ్వాసం పెట్టేవారమని స్పష్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి కూడా అవిశ్వాసం పెట్టాలని తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీని ముగ్గులోకి దింపి, ఏవిధంగానయినా అవిశ్వాసం పెట్టించి, మార్చిలోగా ఎన్నికలకు సిద్ధం కావాలనే వ్యూహంతో వైయస్సార్ కాంగ్రెసు తనముందున్న అన్ని అస్త్రాలనూ వాడుతోందని అంటున్నారు. తెలుగుదేశంపై ప్రతిరోజూ దాడి చేయడం ద్వారా ఆ పార్టీపై మానసిక యుద్ధం చేసి, అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధం చేయించాలన్న ఎత్తుగడతో వెళుతోంది.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. గతంలో రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతునిచ్చిన వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు మళ్లీ ఇరుకునపెడుతోంది. ఆ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి వెైయస్సార్ కాంగ్రెసును ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్పెై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు నాడు రాష్టప్రతి ఎన్నికల్లో ఎందుకు మద్దతునిచ్చిందని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు.
తాము మద్దతు ఉపసంహరిస్తే విజయమ్మ వెళ్లి కాంగ్రెస్తో బేరాలాడుకుని, జగన్ను బయటకు తీసుకురావాలన్నదే వైయస్సార్ కాంగ్రెసు అసలు వ్యూహమని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది. అవిశ్వాసం ఎప్పడు పెట్టాలో, ఏ అంశం మీద పెట్టాలో కాంగ్రెస్తో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకునేవారి నుంచి తాము నేర్చుకోవలసిన అవసరం లేదని దాడి వీరభద్ర రావు విరుచుకుపడ్డారు. గతంలో వెైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టలేదని, అందువల్ల రాజశేఖరెడ్డి తెలుగుదేశంతో కుమ్మక్కయినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంగీకరిస్తుందా అన్నారు.