తిరుమల వివాదం: జగన్పై నో యాక్షన్

ఇతర మతస్థులు తిరుమలేశుడ్ని దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్పై సంతకం పెట్టే ఆచారం 1933 నుంచి అమలవుతున్నట్లు సమాచారం. శ్రీవెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, వైయస్ జగన్ సంతకం చేయకుండానే తిరుమలేశుడ్ని సందర్శించుకున్నారు. దీనిపై వివాదం చెలరేగుతోంది. అయితే, అందుకు జగన్పై చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం.
దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య మాటలే జగన్పై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తేల్చేశాయి. డిక్లరేషన్పై సంతకం చేయాలని చట్టం చెప్పడం లేదని, సంతకం చేయాలని చట్టం లేదని, అది సంప్రదాయం మాత్రమేనని ఆయన అన్నారు. అయితే, ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతి శానససభా నియోజకవర్గంలో తిరుమల ఉంది. జగన్ అనుచరులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, లేదా అనేది మాత్రమే పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విషయంపై తాము విచారణ జరుపుతున్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ చెప్పారు.
శబరిమలై, గురువయ్యారు, పూరి జగన్నాథ స్వామి వంటి ఆలయాల్లో ఆచారాలను కఠినంగా అమలు చేస్తారు. అయితే, తిరుమలలో అంత పకడ్బందీగా ఆచారాలను అమలు చేస్తున్నారా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. జగన్ తిరుమలను సందర్శించుకోవడంపై చెలరేగిన వివాదం ప్రస్తుతానికి రాజకీయపరమైందనే భావన మాత్రమే వ్యక్తమవుతోంది.
తాను బిజెపితో కలుస్తున్నట్లు ప్రచారం చేసి భంగపడిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తన తిరుమల సందర్శనను వివాదం చేస్తున్నారని వైయస్ జగన్ అన్నారు. దానికితోడు, జగన్ అనుచరులు ఎవరూ నినాదాలు చేయలేదని, క్యూలో నిలుచున్న కొంత మంది భక్తులు జై జగన్ అంటూ నినాదాలు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. దీన్నిబట్టి వైయస్ జగన్ తిరుమల సందర్శన రాజకీయ వివాదంగానే కొనసాగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications