ఆపరేషన్ 2014: రాహుల్ సర్వే టీంలో ఫైర్ బ్రాండ్
నవంబర్లో కాంగ్రెసులో గెలుపు గుర్రాలపై సర్వే ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏఐసిసి పరిశీలకులను ఎంపిక చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన యాభై మందిఇందులో ఉన్నారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన వారు ఆరుగురు ఉన్నారు. రాహుల్ సర్వే గ్రూపులో మన రాష్ట్రానికి చెందిన రుద్రరాజు పద్మరాజు, టి.భానుప్రసాద రావు, యాదవ రెడ్డి, గిడుగు రుద్రరాజు, గంగా భవాని, దుర్గేష్లు ఉన్నారు.
అభ్యర్థిని ఎవరిని నిలిపితే గెలుస్తారా తదితర అంశాలపై వారు సర్వే చేయనున్నారు. ఇది పూర్తిగా రాహుల్ గాంధీ పర్యవేక్షణలో కొనసాగుతుంది. వీరితో రాహుల్ సమావేశమై వారికి వివరాలు తెలియజేశారు. ప్రజాభిప్రాయం సేకరించి ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురి పేర్లు సూచించాలన్నారు. ఈ సర్వేలో సానుకూల పరిణామాలు ఎదురైతే ముందస్తు ఎన్నికలకూ వెళ్లే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
బెంగళూరులో అవగాహన సదస్సుకు హాజరైన రాహుల్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని, అందుకు తగిన వారిని ఎంపిక చేయాలని, ఆ అభ్యర్థులెవరో మనం గుర్తించాల్సి ఉందని తెలిపారని సమాచారం. స్థానికంగా ఉండే సామాజిక సమీకరణలు, ఇతర రాజకీయాంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని వివరించారు. సిట్టింగ్ ఎంపీల పని తీరును బేరీజు వేయాలని సూచించారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్ని ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు, వారి పని తీరులో మార్పును కూడా పరిశీలించాలని ఆయన వారికి సూచించారు. కాగా తమిళనాడుకు రుద్రరాజు పద్మరాజు, గంగాభవానీ, కేరళకు యాదవ రెడ్డిని, మహారాష్ట్రకు గిడుగు రుద్రరాజు, కందుల లక్ష్మీ దుర్గేశ్లను, ఒడిశాకు భాను ప్రసాద్ను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించే బృందం పేర్లు బహిర్గతం కాలేదు. గెలుపు గుర్రాల కోసం రాహుల జాతీయ స్థాయిలో సొంత సర్వే చేస్తుండటం గమనార్హం.