మీడియా వార్: బాబును వైయస్ అనుసరించారా?
తమ వారికి చెందిన పత్రికలకు అత్యధిక వాణిజ్య ప్రకటనలను జారీ చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో అనుసరించిన విధానాన్నే వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రభుత్వ హయాంలో అనుసరించారనే విషయాన్ని సాక్షి దినపత్రిక గురువారం ప్రచురించిన ఓ వార్తాకథనం చెప్పకనే చెబుతోంది. పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి అని, అందులో ఆర్ఎన్ఐ సర్టిఫికెట్ కలిగి ఉండడం, ఆరు నెలలుగా ప్రచురితమవుతుండడం వంటిని కొత్త పత్రికలకు సాధ్యం కాదని అంటూ అందుకని కొత్త పత్రికలకు ప్రకటనలు ఇవ్వడానికి వీటిని మినహాయిండం అనేది ఎప్పటి నుంచో ఉందని సాక్షి దినపత్రిక వార్తాకథనం చెబుతోంది. వైయస్ హయాంలో తమకు ఎక్కువ ప్రకటనలు ఇవ్వడాన్ని సాక్షి అలా సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఏయే పత్రికలకు మినహాయింపులో ఇచ్చారో వివరాలు ఇచ్చింది.
నిబంధనలను సడలిస్తూ వార్త, ఆంధ్రజ్యోతి, ఎతెమాద్, సూర్య, సాక్షి పత్రికలకు మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వాలు ఏ తేదీన జీవోలు జారీ చేసిందీ సాక్షి దినపత్రిక తెలిపింది. ఈ పత్రికల్లో వార్త, ఆంధ్రజ్యోతి దినపత్రికల కోసం చంద్రబాబు నిబంధనలను సడలించారని తెలిపింది. ఆంధ్రజ్యోతికి ఎందుకు నిబంధనలు సడలించారు, చంద్రబాబును ఎందుకు పిలువకూడదని సాక్షి ప్రశ్నించింది. మిగిలినవారికి మినహాయింపులు ఇచ్చినప్పుడు ఈనాడు ఎందుకు ప్రశ్నించదు, సాక్షికి ఇస్తేనే ఎందుకు విషం చిమ్ముతోందని అడిగింది. ఈ రెండు ప్రశ్నలతో సాక్షి తన వార్తాకథనాన్ని ముగించింది.