రాజ్యసభ బరిలో వైయస్ జగన్ పార్టీ?
ఏప్రిల్లో రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఇందులో నాలుగు స్థానాలు కాంగ్రెసు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఆ సమయంలో కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో బేరసారాలు ఆడవచ్చునని అంటున్నారు. దాన్ని నివారించడానికి జగన్ తన అభ్యర్థినే పోటీకి పెట్టాలని అనుకుంటున్నారు. అభ్యర్థిని పోటీకి దించడానికి పది మంది శాసనసభ్యుల సంతకాలు సరిపోతాయి. సీటు గెలవాలంటే మాత్రం 39 నుంచి 42 మంది శాసనసభ్యుల మద్దతు అవసరమని తెలుస్తోంది. గెలిచే అవకాశాలు లేనప్పటికీ కాంగ్రెసు వైపు వెళ్లకుండా తన శాసనసభ్యులను కట్టడి చేయడానికి జగన్ తన అభ్యర్థిని పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మతో కలిపి జగన్ వెంట 18 మంది శాసనసభ్యులున్నారు. జగన్ వ్యూహాన్ని పసిగడితే మాత్రం ఆయన వర్గం శాసనసభ్యులపై వేటు పడవచ్చునని అంటున్నారు.