జగన్ కేసు: కెవిపిపై ఆరా తీస్తున్నారు

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ జగన్ సహా పలువురు మంత్రులను, అధికారులను విచారించింది. కానీ, కెవిపిని మాత్రం ఇప్పటి వరకు పిలువలేదు. తెలుగుదేశం పార్టీ వంటి ప్రధాన ప్రతిపక్షం వైయస్ హయాంలో కెవిపి చక్రం తిప్పారని ఆరోపిస్తున్నారు. జగన్ ఆస్తులకు సంబంధించి కెవిపి పాత్ర ఉందనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ, ఇప్పటి వరకు సిబిఐ అతనిని విచారించలేదు. కెవిపి ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా మాత్రం ఓసారి సిబిఐ ఎదుట హాజరయ్యారు.
జగన్, ఎమ్మార్ కేసులకు సంబంధించి సిబిఐ పలువురి వివరాలను పలుమార్లు సిబిఐ ప్రభుత్వాన్ని అడిగింది. తాజాగా కెవిపి గురించి అధికారికంగా సమాచారాన్ని కోరింది. కెవిపి అధికారికంగా ఎలాంటి పదవులు నిర్వహించారు? ఏ నిబంధనల కింద ఆయనను నియమించారు? ఆయన ప్రభుత్వం నుండి పొందిన ప్రయోజనాలేమిటి? ప్రభుత్వానికి కలిగిన లాభం ఉందా? తదితర పలు విషయాలు ఇవ్వాలని సిబిఐ కోరిందట.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి కీలకంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. వైయస్ వద్దకు వెళ్లాలంటే మొదట కెవిపిని కలవాల్సిందే అనేవారు. మొదటిసారి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక కెవిపిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. కేబినెట్ హోదా కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications