స్టిల్స్: 'ఘరానా మొగుడు' చిరంజీవి ఒక్కడే!
హైదరాబాద్: ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవికి భారత సినిమా రంగంలోని దిగ్గజాల జాబితాలో చోటు దక్కింది. "వందేళ్ల సినిమా: భారత సినిమాల ముఖచిత్రాన్ని మార్చేసిన మగాళ్లు" అంటూ సిఎన్ఎన్ ఐబిఎన్ రూపొందించిన జాబితాలో తెలుగు నుంచి చిరంజీవి ఒక్కడికే స్థానం దక్కింది. చిరంజీవికి ప్రముఖ మీడియా సంస్థ ఆ రకంగా మెగా కితాబు ఇచ్చేసింది. చాలా నెమ్మదిగా సినిమాల్లో ప్రారంభమైన చిరంజీవి 1980 దశకం మధ్యకు వచ్చేసరికి తిరుగులేని కథానాయకుడిగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.
భారతీయ సినిమా పరిశ్రమ తన ప్రయాణాన్ని ప్రారంభించి త్వరలో 100 సంవసత్సరాలు పూర్తి కాబొతున్న తరుణంలో ప్రముఖ మీడియా సంస్థ సిఎన్ఎన్ - ఐబియన్ మీడియా ప్రత్యేకంగా ఒక జాబితాను తయారు చేసింది. సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన నటుల జాబితాలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక్క చిరంజీవి మాత్రమే స్థానం దక్కించుకున్నారు.

చిరంజీవి ఒకేసారి మాస్ హీరో కాలేదు. క్రమంగా ఆయన సినీ రంగంలో ఎదుగుతూ వచ్చారు. 1978లో ప్రాణంఖరీదు ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. పునాదిరాళ్లు వంటి చిన్న సినిమాల్లో కూడా ఆయన తొలినాళ్లలో నటించారు. మోసగాడు వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా వేశారు. మంచుపల్లకి వంటి హీరోయిన్ ప్రాధాన్యం గల సినిమాల్లో కూడా నటించారు.

పున్నమినాగు చిత్రంలో చిరంజీవి అద్భుతమైన నటనను, నృత్య ప్రతిభను కనబరిచారు. దీంతోనే ఆయనలోని మాస్ నటుడు వెలికి వచ్చాడని చెప్పవచ్చు.

ఖైదీ సినిమా చిరంజీవి దశనే మార్చేసింది. తిరుగులేని మాస్ హీరోగా ముందుకు రావడానికి ఇది పునాది వేసింది.

ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడు వంటి పలు సినిమాలు తన నటనతోనే కాకుండా స్టెప్పులతో, ఫైట్లతో యువతను ఉర్రూతలూగించారు.

కేవలం మాస్ హీరో పాత్రలకే పరిమితం కాకుండా హీరో వర్షిప్ అంతగా కనిపించని స్వయంకృషి సినిమాలో నటించి మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

రుద్రవీణ మరో క్లాసిక్ సినిమా. చిరంజీవిని తెలుగు కుటుంబాల మధ్యకు తీసుకుని వెళ్లిన సినిమాల్లో స్వయంకృషితో పాటు రుద్రవీణ కూడా ఉంటుంది.

ఆ తర్వాత వయసు పెరిగిన తర్వాత కూడా మాస్ హీరోగా నిలబడడానికి ఆయనకు ఇంద్ర సినిమా బాగా ఉపయోగపడింది.

ఠాగోర్ సినిమా విశేషంగా ప్రజాభిమానాన్ని సంపాదించుకుంది. అవినీతిపై యుద్ధం ప్రకటించిన హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు.

రాజకీయాల్లో మాత్రం ఎన్టీ రామారావులా జయకేతనం ఎగుర వేయలేకపోయారు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పెద్దగా సీట్లు సంపాదించలేకపోయింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేసి, కేంద్ర మంత్రి పదవిని అధిష్టించారు.
అలాగే తమిళం నుంచి శివాజీ గణేశన్, ఎంజి రామచంద్రన్, రజనీకాంత్, కమల్ హసన్, కన్నడం నుంచి రాజ్కుమార్లు దక్కించుకున్నారు. మలయాళం నుంచి మోహన్ లాల్, ముమ్మట్టి స్థానం దక్కించుకున్నారు. హిందీకి పెద్ద పీట వేశారు. హిందీ సినిమాకు సంబంధించి ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వంటి నటులు స్థానం దక్కించుకున్నారు.
మెగాస్టార్గా మాస్ను ఉర్రూతలూగించిన చిరంజీవి ఒక్కడికే సిఎన్ఎన్ ఐబియన్ జాబితాలో చోటు దక్కింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వంటివారికి అందులో చోటు దక్కలేదు. ఎన్టీ రామారావు నుంచి మొదలు పెడితే చిరంజీవి వరకు మాస్ హీరోల జాబితా తెలుగు సినిమాలో ఉంది. బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమాగా చిరంజీవిని ఆ మీడియా సంస్థ అభివర్ణించింది.












Click it and Unblock the Notifications