కీలకం: పట్టుకు చిరంజీవి మెగా వ్యూహం
తీవ్రమైన వ్యాఖ్యలు, పరుష పదజాలం లేకుండా అన్ని విషయాలను సూటిగా, నెమ్మిదిగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అభినందిస్తూనే ఆయన వ్యవహారశైలిపై చిరంజీవి సోనియా గాంధీకి చెవులు కొరికినట్లు చెబుతున్నారు. తాను ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన ఉద్దేశ్యాన్ని ఈ సయమంలో వాడుకున్నట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీ ప్రాధాన్యం చెలిసినందు వల్లనే తాను ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశానని, కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నానని, కానీ రాష్ట్రంలో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని, పార్టీని గెలిపించేందుకు ఎంతగా కష్టపడేందుకైనా సిద్ధమని, పనిచేసేందుకు అనువైన వాతావరణం లేదని ఆయన సోనియాకు వివరించినట్లు చెబుతున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మంచివేనని, కానీ వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి అందరి సలహాలు తీసుకుని అమలు చేయడం అవసరమని, పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇచ్చి వారి సలహాలను కూడా స్వీకరిస్తే సమన్వయం కుదురుతుందని, పార్టీ సీనియర్ నేతలను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవహరిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరదని ఆయన చెప్పినట్లు సమాచారం.
మొత్తం మీద, చిరంజీవి సోనియాను పునరాలోచనలో పడేశారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.