మేం మారేది లేదు: కిరణ్ది లాజిక్ అన్న డిగ్గీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తార్కికమైన విధానంతో మాట్లాడారని తాను భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. సమస్యలు తేల్చాకే విభజనపై ముందుకు వెళ్లాలని కిరణ్ రెండు రోజుల క్రితం సీరియస్గా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, ఇతర తెలంగాణ నేతలు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.
దీనిని డిగ్గీ దృష్టికి తీసుకెళ్లగా... కిరణ్ తార్కికంగా మాట్లాడి ఉంటారని చెప్పారు. కిరణ్ తప్పేమీ మాట్లాడలేదని, ఆయన వివిధ అంశాలను మాత్రమే లేవనెత్తారన్నారు. తాను ముఖ్యమంత్రి పత్రికా సమావేశం క్లిప్పింగ్లను చూశానని, సిడిలను కూడా తెప్పించుకున్నానని, ఆయనతో కూడా మాట్లాడానని, ఆయన సిడబ్ల్యూసిని ధిక్కరించలేదన్నారు. విభజన మూలంగా తలెత్తే సమస్యల గురించి ఆయన తొలి నుంచీ చెబుతున్నారన్నారు.
ఆయన నుంచి తాము విరమణ కోరమన్నారు. ముఖ్యమంత్రి తార్కికమైన విధానం అనుసరించారని భావిస్తున్నానని చెప్పారు. ఆయనతో మాట్లాడాక తాను పూర్తిగా సంతృప్తి చెందానని చెప్పారు. కిరణ్ విధేయుడైన కాంగ్రెస్ కార్యకర్త అని కితాబిచ్చారు. సిఎం కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్య తగాదా ఏమీ లేదన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి కాంగ్రెస్ వాదులంతా కట్టుబడి ఉండాలని సూచించారు.
ఆంటోనీ కమిటీ కాకుండా ప్రభుత్వం తరఫున ప్రత్యేక కమిటీ వేయాలన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ... వారు మారినా తాము మారమన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ టిడిపి ఇచ్చిన లేఖ తమ వద్ద ఉందని, బాబు దానిని వెనక్కి తీసుకోవచ్చు కానీ, కాంగ్రెస్ మాత్రం మాత్రం వెనక్కి తగ్గదని కుండబద్దలు కొట్టారు.