ఫ్రంట్కైతే జైపాల్ రెడ్డి సరే: కెసిఆర్ ససేమిరా?
తెలంగాణ సాధనకు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఫ్రంట్ స్థాపించాలన్న కాంగ్రెస్ సీనియర్ల సూచనను కెసిఆర్ వ్యతిరేకిస్తున్నారు. ఫ్రంట్ స్థాపిస్తే అన్ని రాజకీయ పార్టీలూ తమ జెండాలు పక్కకుపెట్టి, అందులో చేరే అవకాశం ఉందని, దాని ద్వారా తెలంగాణ సాధన సాధ్యమవుతుందని వాదిస్తున్నారు. తెరాసలో చేరడం వల్ల ఆ పార్టీ బలపడుతుందే తప్ప, తెలంగాణ రాదని స్పష్టం అంటున్నారు. ఫ్రంట్కు అంగీకరిస్తే జైపాల్రెడ్డి, జానారెడ్డి వంటి అగ్రనేతలు, ఇతర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు.
పైగా 27లోగా తెరాసలో చేరితేనే టికెట్లు ఖరారు చేస్తానని డెడ్లైన్ విధించడంపై మండిపడుతున్నారు. ఫ్రంట్ పుట్టుకువస్తే తెరాస మనుగడ, ఉనికి ఉండదని, అన్నీ ఫ్రంట్ ద్వారానే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్న భయాందోళనతోనే కెసిఆర్ ఈ ప్రతిపాదనకు అడ్డం పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. ఫ్రంట్ పెడితే వచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కెసిఆర్ తన పార్టీని పక్కకు పెట్టాలని వారంటున్నారు. తాము మాత్రమే కాకుండా తెలుగుదేశం, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు నుంచి కూడా వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
తాను కొత్త ఫ్రంట్కు మద్దతునిచ్చినా లేదా తానే ఫ్రంట్లో చేరినా తెరాసకు ఉనికి లేకుండా పోతుందని కెసిఆర్ భయాందోళన చెందుతున్నారని, అందుకే ఫ్రంట్ పేరెత్తితేనే చిరాకుపడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అప్పుడు అభ్యర్ధుల ఎంపిక, టికెట్ల పంపకాలు, ప్రచారం, ఎన్నికల తర్వాత జరిగే పరిణామాల్లో తన ప్రమేయం, పెత్తనం ఏమీ ఉండదని అందుకే ఆయన ఫ్రంట్కు అంగీకరించడం లేదని అంటున్నారు.
కెసిఆర్ మాటలు నమ్మి పార్టీలో చేరితే తమకు తగిన గౌరవం దక్కదనే భయంతోనే చాలా మంది తెరాసలో చేరడానికి వెనకాడుతున్నారు. పార్టీలో చేర్చుకోవడానికి ముందు ఇచ్చే గౌరవమర్యాదలు ఆ తర్వాత ఉండవని అంటున్నారు. దాంతో ఫ్రంట్ పెడితే ఆ సమస్య ఎదురు కాదని అంటున్నారు. కేంద్రమంత్రి జైపాల్రెడ్డి, మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు, మంత్రులు కూడా తమ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ ఫ్రంట్ స్థాపించి ఉద్యమించాలన్న యోచనలో ఉన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దానికి తెలంగాణలో పెద్ద పార్టీ అయిన తెరాస సహకరించవలసి ఉంటుందని, లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉందంటున్నారు.