పిలుపు మాత్రమేనా?: కెసిఆర్ ఒంటరి పోరాటం
జెఏసిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలు భారతీయ జనతా పార్టీ, సిపిఐలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. జెఏసిలో చర్చించకుండా కెసిఆర్ బందుకు ఎలా పిలుపునిచ్చారని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అప్పుడే ఘాటుగా ప్రశ్నించారు. జెఏసిలో చర్చించకుండా కెసిఆర్ ప్రకటించడంతో తాము బందుకు దూరంగా ఉంటామని చెప్పిన వారు ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
చలో అసెంబ్లీకి జెఏసి పిలుపునిచ్చింది. దీంతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్య పక్షాలు పాల్గొని విజయవంతం చేశాయి. శనివారం నాటి బందుకు భాగస్వామ్య పక్షాలు సహకరించక పోవడంతో దానికి అంతగా స్పందన కనిపించలేదనే చెప్పవచ్చు. దీనిని ఉదహరిస్తూ.. కెసిఆర్ పైన తెలంగాణవాదులు ఎదురుదాడికి దిగుతున్నారు. కెసిఆర్ అందర్నీ కలుపుకొని పోకపోవడం వల్ల తెలంగాణ ఉద్యమానికి తీవ్ర నష్టం చేస్తున్నారని టిటిడిపి మండిపడింది. బిజెపి, సిపిఐలు కూడా ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
చలో అసెంబ్లీకి ముందు కెసిఆర్ పార్టీ క్యాడర్తో మాట్లాడుతూ.. జెఏసి పిలిస్తే ఎవరోస్తారు... మనమే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే జెఏసి పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ విజయవంతమైందని, కెసిఆర్ పిలుపునిచ్చిన బంద్కు స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ కేవలం పిలుపును మాత్రమే ఇస్తూ.. ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.
కెసిఆర్ ఫామ్ హౌస్ నుండి పిలుపునిస్తూ ఓట్ల పంటను అక్కడ పండించే చేస్తున్నారని, ఉద్యమంలో మాత్రం ఆయన కనిపించరని, గతంలో సాగర హారం జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్నారని, తాజా చలో అసెంబ్లీ సమయంలోను ఆయన పాల్గొనలేదని మండిపడుతున్నారు. తెలంగాణ సాధించాలంటే ఉమ్మడిగా నడిచి... ఉమ్మడి ఫలాలు అందుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు.
చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని కోరిన కెసిఆర్ ప్రత్యక్షంగా పాల్గొనకుండా ఫామ్ హౌస్లో ఉండి ఉద్యమ వ్యూహరచన చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకొని తెలంగాణ బందుకు పిలుపునివ్వడం దారుణమని తెలంగాణ విద్యార్థి(స్వతంత్ర) ఐకాస మండిపడింది. కెసిఆర్ వైఖరి ఇలాగే ఉంటే తాము ఫాం హౌజ్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కెసిఆర్ ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని కోరారు.