జగన్, కెసిఆర్కు తారుమారు: బాబుకు కిక్(పిక్చర్స్)
సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఆయా పార్టీల్లో వేడి రాజుకుంది. ఆయా పార్టీల్లోని నేతలు తమకు అనుకూలమైన నియోజవర్గ బాధ్యత, పదవులు కేటాయించకుంటే ఇతర పార్టీల నుండి హామీలు పొంది, ఆ పార్టీలలో చేరుతున్నారు. అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఇటీవలి వరకు టిడిపి, కాంగ్రెల నుండి జగన్ పార్టీలోకి ఓ సమయంలో, తెరాసలోకి మరో సమయంలో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు మాత్రం అన్ని పార్టీలలో ఒక్కసారిగా ఈ వేడి రాజుకుంది. టిడిపి, కాంగ్రెసుల నుండి పెద్ద ఎత్తున వలసలు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలోకి ఉంటాయని భావించారు. కానీ ఆ పార్టీలలోకి కూడా నేతలు క్యూ కడుతుండటం విశేషం. రుసరుసలు, రాజీనామాలు, అసమ్మతులు, ఆగ్రహావేశాలు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పార్టీల్లో ఒకే రోజు బయటపడ్డాయి. అంతా కుదురుకంటుందని, అన్నీ సర్దుకున్నాయనుకునే సమయంలో అధికార కాంగ్రెస్లో ఏకంగా కేబినెట్లోనే కల్లోలం మొదలైంది.
కొన్నాళ్ల క్రితం తెరవెనక్కి వెళ్లిన ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి అంశం మళ్లీ రాజుకుంది. మంత్రివర్గంలో సిఎం అనుకూల, సీఎం వ్యతిరేక విభజన ఒకింత స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసానికి గురువారం ఉప ముఖ్యమంత్రి రాజ నరసింహ, జానా రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, వట్టి వసంత కుమార్ వచ్చి అంతా కలిసి చర్చించుకున్నారు. సిఎం వైఖరికి వ్యతిరేకంగా మంత్రులను సమీకరించాలని జానా రెడ్డి భావిస్తున్నారట.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుటుంబ సమేతంగా గుడ్బై చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర సక్సెస్ను ఆనందిస్తున్న టిడిపి నేతలకు ఈ పరిణామం ఒకింత దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇతర పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గులాబీ దండుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొమ్మాటి సాంబయ్య బుధవారమే షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు.
సస్పెన్షన్ వేటు పడిన మాజీ ఎపి చాడ సురేశ్ రెడ్డి కెసిఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాడుకుని వదిలేయడం కెసిఆర్కు అలవాటే పార్టీకి కంచుకోట వంటి వరంగల్ జిల్లా నుంచే వలసలు మొదలు కావడాన్ని తెరాస నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలను ప్రకటించినప్పటి నుంచి విభేదాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి రగులుకుంటోంది.
ఉప ఎన్నికల సమయంలో విజయానందం తట్టుకోలేక గాలిలోకి కాల్పులు జరిపిన పార్టీ మైనారిటీ సెల్ కన్వీనర్ రెహ్మన్కే గుండె రగిలిపోయింది. 'రెహమాన్ రెడ్డినైనా కాకపోతిని' అంటూ ఆక్రోశించారు. ఆ తర్వాత పెద్దలు ఆయనను కూల్ చేశారు. మరోవైపు దాడి రాకను కొణతాల వర్గం జీర్ణించుకోలేకపోతుంది. టిక్కెట్ల విషయంలో ముందు ముందు మరిన్ని తిరుగుబాట్లు అన్ని పార్టీల్లో తప్పని సరిగా కనిపించే అవకాశముంది.

రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెసు, తెదేపా, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలలో టిక్కెట్లు, పదవుల సెగ ప్రారంభమైంది. పార్టీ అధినేతలకు, అధిష్టానానికి ఝలక్ ఇస్తు ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు. దీనిని అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది.

కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న దాడి వీరభద్ర రావు టిడిపికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. తన తనయుడు రత్నాకర్కు సరైన నియోజకవర్గం కోసం ఆయన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో చర్చలు జరుపుతున్నారట. అయితే ఇన్నేళ్లు టిడిపిలో ఉండి కాంగ్రెసు, వైయస్ రాజశేఖర రెడ్డిని ఘాటుగా విమర్శించిన దాడి ఇప్పుడు అవే పార్టీల వైపు చూస్తుండటం గమనార్హం.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఇటీవల ఆయా జిల్లాల్లో అసంతృప్తుల చిట్టా పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా ఆ లిస్టులో చేరిపోయారు. అయితే, అధిష్టానం బుజ్జగింపులతో ఆయన వెనక్కి తగ్గారు. విశాఖలో దాడి రాకను కొణతాల వర్గం వ్యతిరేకిస్తోంది. పార్టీ అధిష్టానంపై ఆ వర్గం అసంతృప్తితో ఉంది.

అధికార కాంగ్రెసు పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై మరొకరు అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట. పథకాల విషయంలో కిరణ్ ఒంటెత్తు పోకడతో వెళ్తున్నారని వైరి వర్గం, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని కిరణ్ వర్గం అంటోంది.

తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తెరాసలోకి వలసలు జోరుగా ఉంటాయని భావించిన కెసిఆర్కు షాక్ ప్రారంభమైంది. మాజీ ఎంపి చాడ సురేష్ రెడ్డి సహా ముగ్గురు వరంగల్ నేతలు టిడిపి వైపు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications