తెలంగాణకు రాహుల్ గాంధీ కొర్రీ?
తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమ పార్టీకి లాభమా, నష్టమా అనే విషయంపై రాహుల్ గాంధీ ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లాభపడే పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలనే మీమాంసలో కూడా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. గత 12 ఏళ్ల ఉద్యమం కారణంగా తెరాస తెలంగాణలో బలపడుతుందనే ఉప్పు ఆయనకు అందిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించే విషయంపై కూడా రాహుల్ గాంధీ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు. సాంకేతికంగా అది సాధ్యం కాకపోవచ్చని, పంజాబ్-హర్యానా మాదిరిగా ఇక్కడ భూగోళిక పరిస్థితుల్లో మార్పు ఉందని చెబుతున్నారు. హైదరాబాద్కు శ్రీకాకుళం జిల్లాకు చాలా దూరం ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, సీమాంధ్రలో రాజధాని ఏర్పడేవరకూ అక్కడ మౌలిక సదుపాయాలు, ఇతర నిర్మాణాలు, సౌకర్యాలు రూపుదిద్దుకునేవరకూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా సుముఖంగా ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా కొంతకాలం వరకూ ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు అభ్యంతరం లేదని చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు.
తెలంగాణపై విస్తృతంగా చర్చలు జరిపిన రాహుల్ చివరకు రెండవ ఎస్సార్సీ వైపే మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానితోపాటు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నందున అన్నింటికీ కలిపి ఎస్సార్సీ వేస్తే సరిపోతుందని రాహుల్ కొందరు సీనియర్ల వద్ద వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈనెల 18న జైపూర్లో జరిగే చింతన్ శిబిర్లో తెలంగాణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత 26న జరిగే యుపీఏ భాగస్వామ్యపక్షాల భేటీలో పూర్తి స్పష్టత వస్తుందని, బహుశా అదే రోజు సాయంత్రం అధికార ప్రకటన వస్తుందని అంటున్నారు.