ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్: కెసిఆర్తో టాక్స్
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం లేదని దానం నాగేందర్ అన్నారు. దానం నాగేందర్ హైదరాబాదుకు చెందినవారు. పైగా, ఇప్పటి వరకు ఆయన తెలంగాణ కచ్చితమైన అనుకూలత వ్యక్తం చేయలేదు. ఆయనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని, హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం లేదని, ఉమ్మడి రాజధానిగా మాత్రం ఉంచుతారని చెప్పడాన్ని బట్టి కాంగ్రెసు అధిష్టానం ఆలోచన వ్యక్తమవుతోంది.
కాగా, కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నన్నట్లు తెలుస్తోంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెరాసను కాంగ్రెసుతో తెరాసను విలీనం చేసే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ చెప్పారని, తెరాస కార్యకర్తలు కాంగ్రెసు కార్యకర్తలుగా పనిచేస్తారని అధిష్టానంతో అన్నారని ఆయన వివరించారు.
హైదరాబాద్ కొంత కాలం పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఈ నెల 18వ తేదీన తెలంగాణకు సంబంధించి కీలక భేటీ ఉంటుందని కేంద్ర మంత్రి వాయలార్ రవి చెప్పినట్లు పాల్వాయి తెలిపారు. మొత్తం మీద, రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రస్తుతం సంకేతాలు వస్తున్నాయి. అయితే, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. చివరి నిమిషంలో కాంగ్రెసు అధిష్టానం మనసు మారినా ఆశ్చర్యం లేదనే వారున్నారు. కానీ, తెలంగాణపై కచ్చితమైన ప్రకటన చేయాలనే ఒత్తిడిలో మాత్రం అధిష్టానం ఉంది.