టీపై ఆగని కేంద్రం: సోమవారం షిండే ప్రకటన
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అత్యంత చురుగ్గా కదులుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు సీమాంధ్ర నాయకుల ఒత్తిడిని, సీమాంధ్రలోని ఆందోళనలను లెక్కచేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగిపోలేదని, కొనసాగుతోందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్వజయ్ సింగ్ శనివారంనాడు చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నదని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియపై విధాన ప్రకటన చేస్తారని ఈ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆ శాఖ అధికారులు కేబినెట్ నోట్ను సవివరంగా రూపొందించడంలో నిమగ్నమయ్యారని, నోట్ పూర్తి అయ్యేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చునని ఈ వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 15న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎర్రకోటనుంచి చేసే ప్రసంగంలో తెలంగాణ గురించి ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వచ్చే వారం ఢిల్లీకి పిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆచితూచి స్పందించారు. అయినా, ఆయన తీరుకు కాంగ్రెసు అధిష్టానం ఆందోళనకు గురైనట్లు చెబుతున్నారు.
సోమ, మంగళ వారాల్లో ఆహార భద్రత బిల్లుపై లోక్సభలో చర్చ జరుగనుంది. మంగళవారం సాయంత్రమే భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వర్గాలు నిర్ణయించాయి.ఆహార భద్రత బిల్లు విషయానికి వస్తే సమాజ్వాదీ పార్టీ సభనుంచి వాకౌట్ చేసే అవకాశాలున్నందువల్ల సమస్యలకు తావు లేదని కాంగ్రెస్ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. పింఛను నిధి అభివృద్ధి బిల్లుపై కూడా ప్రతిపక్షాలతో ఒక అవగాహనకు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మూడు బిల్లులు ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications