జగన్ లేకున్నా దూకుడే: బెయిల్పై ఫిక్సయ్యారా?

ఇటీవల సుప్రీం కోర్టులో చుక్కెదురు కావడంతో సెప్టెంబరులో తప్పకుండా బెయిల్ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అంతర్గతంగా మాత్రం వారు బెయిల్ రాదని ఓ క్లారిటీకి వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకే కాకుండా వచ్చే సాధారణ ఎన్నికలకు కూడా జగన్ లేకుండానే సిద్ధం కావాలని ఆ పార్టీ భావిస్తోందని అంటున్నారు. అందుకోసం ప్రణాళికాబద్దంగా వెళ్తోందని అంటున్నారు.
పార్టీలోని అంతర్గత విభేదాలను, పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం వంటి అంశాలపై జగన్ సూచనలు, సలహాలతో విజయమ్మ, షర్మిల, ఇతర ముఖ్య నేతలు చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జగన్ లేకుండానే ఆయన సలహాలతో పరిస్థితులను చక్కబెట్టుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పలు నిర్ణయాలు కూడా జగన్ రాడని వారు ఫిక్స్ అయినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణ ప్రాంతంలో మొదట విజయమ్మ ఓదార్పు లేదా యాత్ర చేపట్టాలని భావించారు. అయితే జగన్కు బెయిల్ వస్తుందనే ఆశతో... జగన్తోనే ఓదార్పు యాత్ర చేయించాలనే ఉద్దేశ్యంతో విజయమ్మ యాత్రను రద్దు చేస్తున్నట్లు అప్పుడు చెప్పారు. ఇప్పుడు మళ్లీ విజయమ్మచే తెలంగాణ ప్రాంతంలో యాత్ర చేయించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు నెలల తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ సిబిఐ దానిని పొడిగింప చేసే అంశాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి.
జగన్ లేకున్నప్పటికీ గత ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, విజయమ్మ, షర్మిలలకు తోడు పార్టీ ముఖ్య నేతల సహకారంతో స్థానిక ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా తమ పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జగన్కు రాజకీయ కక్ష సాధింపు కారణంగానే బెయిల్ రావడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications