ప్రభుత్వాలకు కనకవర్షం: "మత్తె"క్కిన తెలుగు ప్రజలు, మద్యం ప్రవాహం
హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలు ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా సుమారు 430 కోట్ల ఆధాయం వచ్చింది. ఏపీ రాష్ట్రంలో సుమారు 230 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 207 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు సమాచారం.
కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు భావించారు. ఎక్సైజ్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 300 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతాయని అంచనా వేశారు. కానీ, 200 కోట్ల మేరకు మాత్రమే మద్యం విక్రయాలు సాగాయి.
ఏపీ రాష్ట్రంలో కూడ భారీగానే మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా ఎక్సైజ్ శాఖలకు భారీగానే ఆదాయం వచ్చింది.
భారీగా ఆదాయాలు
కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు భారీగానే ఆదాయం వచ్చింది. సుమారు రూ 430 కోట్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖలకు ఆదాయం వచ్చింది. డిసెంబర్ 31వ, తేది రోజు వరకు అందిన లెక్కల ప్రకారంగానే ఈ ఆదాయం వచ్చినట్టు నివేదికల ప్రకారం తెలుస్తోంది. అయితే ఒకటో తేదిన కూడ మద్యం విక్రయాలు జనవరి మాసం పరిధిలోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 31. రూ207 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. ఏపీ రాష్ట్రంలో రూ.230 కోట్ల విలువైన మద్యం విక్రయాలు డిసెంబర్ 31న, జరగడం గమనార్హం.
డిసెంబర్లో తెలంగాణకు రూ.1700 కోట్ల ఆదాయం
డిసెంబర్ మాసంలో ఎక్సైజ్ శాఖకు సుమారు 1700 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో డిసెంబర్ 31వ, తేదిన రూ.207 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఆదాయంలో ఉమ్మడి హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలదే సింహభాగం వాటా ఉంది. ఈ రెండు జిల్లాల నుండి సుమారు రూ.600 కోట్ల ఆదాయం డిసెంబర్ నెలలో వచ్చింది.
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో రూ.125 కోట్ల విక్రయాలు
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో రూ. 125 కోట్ల విక్రయాలు చోటు చేసుకొన్నాయని అధికారుల నివేదికలను బట్టి తెలుస్తోంది. నూతన సంవత్సర వేడుకల్లో కూడ గ్రేటర్ శివారు ప్రాంతాల్లో భారీగానే మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. సుమారు రూ. 125 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు లెక్కలు తెలుపుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ఒక్క రోజులోనే మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయని అధికారులు తెలిపారు.
ఇతర జిల్లాల్లో రూ. 20 కోట్లు
నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని హైద్రాబాద్, రంగారెడ్డి మినహ ఇతర జిల్లాల్లో సుమారు రూ.20 కోట్ల విలువైన మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి.వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రూ.20 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి.నూతన సంవత్సర వేడుకల్లో గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల పరిధిలోనే ఏకంగా రూ. 125 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.