దారుణం: అత్యాచారాలతో అట్టుడుకుతున్న ఎపి
విజయవాడ: మహిళలపై అత్యాచారాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి దారుంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మహిళలపై అత్యాచారాల సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. సగటున రోజుకు రెండు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవలి గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
2014లో మొత్తం 961 అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అత్యాచార బాధితుల్లో 838 మంది (87.2) శాతం మంది నిందితులకు తెలిసినవారే కావడం ఆశ్చర్యకరమైన విషయం. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో అత్యధిక అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. విశాఖలో 84 కేసులు నమోదు కాగా, బాధితుల్లో 33 మంది మైనర్లు.
విశాఖ తర్వాత స్థానం విజయవాడది. విజయవాడలో 64 రేప్ కేసులు నమోదయ్యాయి. తెలిసినవారే మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన కేసులు 838 నమోదయ్యాయి. నిందితుల్లో 212 మంది పొరుగురు వారు, 34 మంది సన్నిహిత కుటుంబ మిత్రులు, 61 మంది బంధువులు, ఏడుగురు ఉద్యోగులు లేదా సహోద్యోగులు, 522 మంది తెలిసినవారు ఉన్నారు.

మహిళలు నమ్మి దగ్గరకు వస్తే వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. విశాఖలో 99 శాతం కేసుల్లో తెలిసినవారే మహిళలపై అత్యాచారాలు చేసినట్లు, వారు పొరువగువారూ కుటుంబ మిత్రులూ కావడం చూడవచ్చునని అంటున్నారు.
విశాఖపట్నంలో అత్యాచార ఘటనలు పెరుగుతుండడాన్ని గమనిస్తున్న సామాజిక కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలకు ఏ మాత్రం రక్షిత ప్రాంతం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమోదు కాని సంఘటనలు కూడా చాలానే ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications