సిడ్నీ డార్లింగ్ హార్బర్లో కోహ్లీ, అనుష్క జంట
సిడ్నీ: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ మధ్య సంబంధం ఇప్పుడు రహస్యమేమీ కాదు. దీంతో వారిద్దరు చెట్టాపట్టాల్ వేసుకుని బహిరంగంగానే తిరుగుతున్నారు. తాజాగా, వారిద్దరు సిడ్నీలోని డార్లింగ్ హార్బర్లో కలిసి నడుస్తూ కనిపించారు. గురువారంనాడు పికె నటి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఆటవిడుపుగా హార్బర్కు వెళ్లారు.
క్రిస్ట్మస్ పర్వదినానికి అనుష్క శర్మ మెల్బోర్న్కు చేరుకుని తన బాయ్ ఫ్రెండ్ను కలుసుకుంది. విరాట్ కోహ్లీతో కలిసి ఆమె నూతన సంవత్సరం వేడుకలు కూడా జరుపుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో భాగంగా ఓ టెస్టు మ్యాచులో సెంచరీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మకు గాలిలో ముద్దు విసురుతూ కనిపించిన విషయం తెలిసిందే.
నూతన సంవత్సరం తొలి రోజు వారిద్దరు హార్బర్లో ఆటవిడుపుగా నడుస్తూ వినోదించారు. కాస్తా రహస్యంగా మెలగడానికి వారిద్దరు ప్రయత్నించినప్పటికీ వారు దొరికిపోయారు. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడంతో విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే నాలుగో టెస్టుకు అతనే నాయకత్వం వహిస్తాడు.
టెస్టు మ్యాచులో సెంచరీ చేసిన అనంతరం స్టాండ్స్లో ఉన్న తన ప్రియురాలు అనుష్క శర్మకు బ్యాట్ ద్వారా ముద్దు ఇచ్చాడు. ఆ తర్వాత మరో ముద్దు కూడా ఇచ్చాడు. అయితే, అది మిచెల్ జాన్సన్ను కవ్వించేందుకనని అంటున్నారు. మిగతా ఆటగాళ్లను పక్కన పెడితే కోహ్లీ మాత్రం ఆటతో, మాటతో ఆసీస్తో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. గత ఇంగ్లాండ్ పర్యటనలో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ను బీసీసీఐ అనుమతించింది. అప్పుడు విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. ఈసారి మాత్రం అనుష్క శర్మ స్టాండ్లో ఉన్నప్పుడు కోహ్లీ దుమ్మురేపాడు. అంతేకాదు, ఆమెకు బ్యాట్ ద్వారా ముద్దులు పంపించాడు.