నరసింహన్ భవితవ్యం?: కెసిఆర్ ఇలా, చంద్రబాబు అలా...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో మరోసారి ఆయన్ను కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ కొనసాగిస్తుందా? లేదా? అనన విషయమై ఉత్కంఠ నెల
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో మరోసారి ఆయన్ను కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ కొనసాగిస్తుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులు కావడం ప్రతికూలంగా ఉన్నా జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందువల్ల కొనసాగించాలనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళనాడుకు చెందిన నరసింహన్ 2006 డిసెంబరు 31న కేంద్ర నిఘా విభాగం సంచాలకునిగా రిటైరైనా, 2007 జనవరి 25న తొలిసారి ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2010 జనవరిలో బదిలీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు.
2012 మే మూడవ తేదీన తొలిదశ పదవీ కాలం ముగిసినా 2012 మే మూడో తేదీన కేంద్ర ప్రభుత్వం ఇక్కడే మళ్లీ నియమించింది. నాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి ఇన్చార్జి గవర్నర్గా కొనసాగుతున్నారు. మంగళవారంతో రెండో సారీ పదవీకాలమూ ముగుస్తోంది.

నరసింహన్పై సీఎం కేసీఆర్ ఇలా
నరసింహన్ను కొనసాగించాలని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గవర్నర్గా నరసింహన్తో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రతి కీలక దశలో గవర్నర్ అభిప్రాయాన్ని, కేంద్రం మనోగతాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న కేసీఆర్.. రాష్ట్ర గవర్నర్గా నరసింహన్ కొనసాగింపే మంచిదని భావిస్తున్నారు.

నరసింహన్ భవితవ్యంపై బయటపడని ఏపీ సీఎం
రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్గా నరసింహన్ కొనసాగించే విషయమై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు అభిప్రాయం ఏమిటన్నదీ వెల్లడి కాలేదు. అయితే గవర్నర్ వ్యవహార శైలి పట్ల చంద్రబాబు కొన్ని సార్లు అసంత్రుప్తి వ్యక్తంచేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ఉండటంతోపాటు గవర్నర్గా నరసింహన్తో అనునిత్యం సంప్రదింపులు జరుపుతుండటం చంద్రబాబుకు నచ్చినట్లు కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడాది కాలానికి గవర్నర్ ఏపీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బహాటంగానే ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులైన వారు ఇంటికే
నరసింహన్ పదవీ కాలం పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. గతంలో మూడు దఫాలుగా ఎవరూ కొనసాగలేదని తెలిసింది. నరసింహన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఇలా ఒక ప్రభుత్వం నియమించిన వారిని మరోప్రభుత్వం తిరిగి నియమించిన దాఖలాలు కూడా గతంలో లేవు. తమిళనాడు గవర్నర్గా ఉన్న కొణిజేటి రోశయ్యను పదవీ కాలం ముగిసిన తర్వాత కొనసాగించాలని వచ్చిన అభ్యర్థనలు కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో ఆయన పదవీ విరమణ చేయగా, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇలా హైదరాబాద్ శాంతిభద్రతలపై నరసింహన్
ఈఎస్ఎల్ నరసింహన్ విషయంలో ఏం వైఖరి అవలంబిస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. కాకపోతే నరసింహన్ ఒక మాజీ ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులు కాగానే హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై నగరంలోని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. తద్వారా భాగ్యనగరంలో అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకోగలిగారు.

ఇరు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో ఇలా చర్చలు
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ అంశాలపై అవగాహన దృష్ట్యా ఆయనను కొనసాగించే అవకాశం ఉందని కొందరు నేతలు, అధికారులు భావిస్తున్నారు. మరికొందరు అధికశాతం సమస్యలు పరిష్కారమైనందున ఈదిశగా కేంద్రం ఆలోచించకపోవచ్చని వాదిస్తున్నారు. ప్రత్యేకించి ఉద్యోగుల విభజన ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద 9,10 షెడ్యూళ్ల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన కూడా తేలలేదు. ప్రభుత్వ రంగ సంస్థల విభజనపై ఇటీవలే గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల సమన్వయ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.

2015 తర్వాత ఏపీకే బాబు పరిమితం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడాది కాలానికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల సమయంలో ‘ఓటుకు నోటు కేసు' వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ తెలంగాణశాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సహ నిందితుడిగా ఉన్నారు. ఇక ఈ కేసులో కుట్రదారుగా ఆ పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నట్లు ఆడియో సాక్ష్యాలు చెప్తున్నాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఏపీ సీఎం పూర్తిగా విజయవాడకు పరిమితమయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అనారోగ్యం సాకుతో కేసీఆర్ ఇలా
ఓటుకు నోటు కేసు దర్యాప్తులో వేగం పెంచకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోవడంలో కేంద్రం..గవర్నర్ నరసింహన్ సాయం తీసుకున్నదని వినికిడి. ఆ విషయం తెలిసిన వెంటనే మరుసటి రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కూడా కొట్టారని, అందుకు అనారోగ్యం సాకుగా చూపారని అప్పట్లో వార్తలొచ్చాయి.

గవర్నర్గా నరసింహన్ ఇలా
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య రాజీ కుదర్చడంలోనూ, కీలక అంశాల్లో విభేదాలు వచ్చినప్పుడూ సమస్య పరిష్కారానికి పలు సార్లు గవర్నర్గా నరసింహన్ పాత్ర కీలకంగా ఉన్నది. ఒకవేళ గవర్నర్గా నరసింహన్ను కొనసాగించకుంటే ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చే సామర్థ్యం గల ప్రముఖ వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

త్వరలోనే గవర్నర్ భవితవ్యంపై స్పష్టత
వచ్చే జులైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్న సఖ్యత దృష్ట్యా ఈఎన్నికలు పూర్తయ్యే వరకు నరసింహన్ సేవలను వినియోగించుకోవాలనే ప్రతిపాదన కేంద్రం వద్దకు వచ్చినట్లు తెలిసింది. మరొకరిని నియమించకుంటే పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వకున్నా ప్రస్తుత గవర్నర్ కొనసాగవచ్చు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు పూర్తి మెజారిటీ ఉన్న దృష్ట్యా కేంద్రం మరొకరినీ నియమించవచ్చు. దీనిపై ఒకటి, రెండు రోజుల్లోనే స్పష్టత రానున్నది.












Click it and Unblock the Notifications