నోటుకు ఓటు ఎఫెక్టేనా?: మీడియాకు బాబు దూరం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రెండున్నర నెలలుగా హైదరాబాదులో మీడియాకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో కచ్చితమైన కారణం తెలియదు కాదు గానీ నోటుకు ఓటు కేసే అందుకు కారణం కావచ్చునని అనుమానిస్తున్నారు.
మీడియా సావీగా చంద్రబాబుకు పేరుంది. టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేసే సమయాలను చూసుకుని ఆయన మీడియా సమావేశాలు నిర్వహించేవారు. గంటల తరబడి మీడియాతో మాట్లాడేవారు. కానీ రెండున్నర నెలలుగా ఆయన హైదరాబాదు మీడియా ప్రతినిధుల మొహాలు చూడడం లేదు. మే 25వ తేదీన సచివాలయంలోని ఎల్బ్లాక్ కాన్ఫరెన్స హాలులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలసి సంయుక్తంగా నిర్వహించిన సమావేశమే హైదరాబాద్లో చివరిది.
ఓటుకు నోటు కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ తెలుగుదేశం పార్టీనే కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబును కూడా కుదిపేసింది. ఆ తర్వాత కృష్ణాజిల్లా ముసునూరులో ఇసుక మాఫియా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, పుష్కరాల మొదటి రోజు రాజమండ్రిలో 29 మంది మృతిచెందటం లాంటి వంటి వివాదాలు చుట్టుముట్టాయి.
అయినా మంత్రులు, పార్టీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించటమే గానీ ముఖ్యమంత్రి మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఓటుకునోటు వివాదంలో టిటిడిపి శాసనసభ్యుడు రేవంత్రెడ్డి అడ్డంగా దొరికిపోవటంతో వివాదం చెలరేగుతూ వచ్చింది. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రే సూత్రదారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని తెలంగాణాలోని అధికారపార్టీ నేతలు కూడా ఆరోపించారు.
ఈ సమయంలోనే రెండు మంత్రివర్గ సమావేశాలు జరిగినా చంద్రబాబు మాత్రం ఓటుకునోటు వివాదంలో తన పాత్రపై మీడియా ముఖంగా ఇప్పటికి కూడా ఎటువంటి వివరణా ఇచ్చుకోలేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆరోపణలను కూడా తానుగా మీడియాలో ఖండిచలేదు.
అయితే, ఆదే సమయంలో ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ, ఓటుకునోటు వివాదంలో తనను తాను సమర్ధించుకుంటూ చంద్రబాబు మాట్లాడిన తీరుపై సామాజిక, ప్రసార మాధ్యమాల్లో వ్యంగ్య కథనాలు వచ్చాయి. దీంతో ఆ తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. ఓటుకునోటు వెలుగు చూసిన కొద్ది రోజులకు టెలిఫోన్ ట్యాపింగ్ అంశం బయటపడింది. దాంతో తెలంగాణా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయటానికి ఏపి ప్రభుత్వానికి ఆయధం దొరికింది.
తెలంగాణా ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి వెళ్ళినపుడు అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓ మీడియా ప్రతినిధిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. సమస్యలు చుట్టుముట్టడంతో మీడియా ప్రతినిధుల నుంచి పలు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీంతోనే ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది.