"ఇదే మన ఎజెండా?.. జనానికి చెప్పండి, అంతా మనం చేస్తే వైసీపీ పెత్తనమా!"
ఏ దశలోను వైసీపీకి జనంలో మైలేజీ పెరగకుండా చూసేందుకు చంద్రబాబు టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు.
విజయవాడ: వైసీపీ పూరించిన ఎన్నికల శంఖారావం టీడీపీని అప్రమత్తమయ్యేలా చేసింది. ప్రత్యర్థి వ్యూహం ముందే తెలిసిపోవడంతో.. అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ అస్త్రాలను రూపొందించే పనిలో ఆ పార్టీ నిమగ్నమైంది. ఏ దశలోను వైసీపీకి జనంలో మైలేజీ పెరగకుండా చూసేందుకు చంద్రబాబు టీడీపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు.
ముఖ్యంగా పనితీరును మెరుగుపరుచుకోవడం.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఎన్నికలకు ముందు ఎలాంటి రిమార్క్ లేకుండా క్లీన్ ఇమేజ్ తో ఉండాలని ఆయన సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. కేవలం పని చేసుకుంటూ పోవడమే కాకుండా.. అది ప్రణాళికబద్దంగా సాగుతుందా? లోపాలున్నాయా? వంటి విషయాలను సరిచూసుకోవాలని సూచించారు.
చెప్పిన మాటలను పెడ చెవిన పెడితే.. సరైన ఫలితాలు రాకపోతే అది పార్టీ వైఫల్యానికి కారణమవుతుందన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని, నేతలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలతో చెప్పారు.
ప్రజలకు చెప్పండి:
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నెలకొన్న పరిస్థితులు.. ఇక్కడి సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని, అలా అయితేనే ప్రభుత్వం సాధించిన ఫలితాలపై వారికి స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని చంద్రబాబు నేతలకు వివరించారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ప్రతీ నాయకుడు బాధ్యతగా ప్రజలకు చేరవేయాలన్నారు. ముఖ్యంగా కరెంటు కోతల నేపథ్యంలో గతంలో తరుచూ పవర్ హాలీడేలు ఉండేవని, ఇపపుడా పరిస్థితి లేదని, మిగులు విద్యుత్తును సాధించే స్థానంలో ఏపీని నిలబెట్టామని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని జనానికి తెలియపరిచాలని సూచించారు.
Recommended Video
ఇదీ టీడీపీ సమర్థత:
గతంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటే చేతులు ఎత్తేయడమే తప్ప ఏమి చేసేవారు కాదని, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయిందని చంద్రబాబు నేతలకు గుర్తుచేశారు.మర్థ నీటి నిర్వహణ, రెయిన్ గన్స్ టెక్నాలజీ సహాయంతో కరువు సమయంలోను పంటలను కాపాడుతున్నామని తెలిపారు.
అలాగే రైతు రుణమాఫీకి రూ.24 వేల కోట్లు వేల కోట్లు వెచ్చిస్తున్నామని, డ్వాక్రా మహిళలకు రూ.10 వేల కోట్లు, పింఛన్లకు ఏడాదికి రూ.5700 కోట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమానికి రూ.30 వేల కోట్లు, మొత్తంగా రూ.65 వేల కోట్లు సంక్షేమ పథకాలపైనే ఖర్చు చేస్తున్నామన్న విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు.
ఇదే అజెండా?:
'80 శాతం ప్రజల సంతృప్తి.. 80 శాతం సీట్ల సాధన' లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు కీలక సూచన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ కార్యక్రమాలను విరివిగా జనంలోకి తీసుకెళ్లడంతో పాటు.. పథకాల అమలు తీరుపై పర్యవేక్షణ కొరవడకూడదని తెలిపారు.
గతంలో ప్రభుత్వాలు ఏ పథకాలు అమలు చేసినా.. విచ్చలవిడి అవినీతి ఉండేదని, ఇప్పుడా పరిస్థితి అసలే లేదని చంద్రబాబు అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యక్రమం 1100 కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు అవినీతిపై సమాచారం అందుతుందన్నారు. తద్వారా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని సాగిస్తున్నామన్నారు.
అంతా మనం చేస్తే.. వాళ్ల పెత్తనమా?:
రెవెన్యూ లోటులో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి.. అన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నడిపిస్తున్నామని, ఇంత చేసి ప్రతిపక్ష పెత్తనానికి ఆస్కారమివ్వాలా? అని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఆరోపణలు చేసే అవకాశం లేకపోవడంతోనే ఎలాగైనా దానికి అడ్డుకాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సెప్టెంబరు 17 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంతో.. ప్రభుత్వ పనితీరును జనాలకు తెలియపరిచాలని ఆయన వివరించారు. పింఛన్లు, రేషన్ పంపిణీలో 97 శాతం సంతృప్తి ఉందని ఇటీవలి సర్వేలో వెల్లడైనందునా.. మిగిలిన మూడు శాతం ఫిర్యాదులు కూడా పరిష్కరించాలని సూచించారు.
మొత్తం మీద వైసీపీని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే అలసత్వ వైఖరిని వీడాలని చంద్రబాబు గట్టిగానే చెప్పారు. ఆ పార్టీ వేసే ఎత్తుగడలకు చెక్ పెట్టాలంటే ముందు మన పనితీరులో తేడా రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు, పార్టీ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం ఇలా తమ భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చర్చించారు.