బాబు-కేసీఆర్ ఆలింగనం: జై తెలంగాణ, జై ఏపీ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు మరోసారి ఒక వద్దకు వచ్చినప్పటికీ.. ఇరువురు కలిసి ఒకే వేదిక పైన కనిపించలేదు! సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో కేసీఆర్, చంద్రబాబులు పాల్గొన్నారు. అయితే, మొదటగా వచ్చిన కేసీఆర్... చంద్రబాబు వచ్చేలోగా వేదిక పైనుండి వెళ్లిపోయారు.
అయితే, కేసీఆర్ వేదిక దిగి వెళ్తుండగా చంద్రబాబు ఎదురుపడ్డారు. అప్పుడు ఇరువురు సీఎంలు ఆలింగనం చేసుకున్నారు. దత్తాత్రేయ వారిద్దరినీ ఒక దగ్గరకు తోడ్కొని రాగా.. వారిద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబు వేదిక మీదకు వెళ్లగా.. కేసీఆర్ వెళ్లిపోయారు.
రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్, చంద్రబాబులు ఒకే వేదిక పైన కనిపించడం చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వారు ఒకే వేదిక పైకి వచ్చారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
కానీ, చంద్రబాబు, కేసీఆర్లు ముందు, వెనుక పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన అనంతరం జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్ అంటూ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. తాను గత 30 ఏళ్లుగా హైదరాబాదులో ఉంటున్నానని చంద్రబాబు అన్నారు.