చంద్రబాబు ప్లాన్: ఏదైన సిటీకి దగ్గర్లో రాజధాని
హైదరాబాద్: ఏదైనా నగరానికి దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆ దిశలోనే ఆలోచిస్తోందట. ఏదైనా నగరానికి నలభై కిలోమీటర్ల పరిధిలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్కు రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇటీవల రాజధాని విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏదైనా పెద్ద నగరానికి సమీపంలోనే నూతన రాజధాని ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిందట. సమీపంలో పెద్ద నగరం లేకుంటే కొత్త రాజధాని ప్రణాళిక సరిగ్గా అమలు కాదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే నెల రోజుల్లోపు రాజధాని ఎంపిక ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

కనీసం వంద ఏల్ల అవసరాలకు తగినట్లుగా మాస్టర్ ప్లాన్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర నగరాలతో పోలిస్తే ఈ రాజధాని ప్రజలను ఎక్కువగా ఆకర్షించేలా ఉండేటట్లు ప్రణాళిక సిద్ధం చేయనుంది. ఉపాధి, అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా రాజధాని ఉండాలని లక్ష్యం పెట్టుకుంది. నిర్మాణాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా చేపడుతూ.. మూడేళ్లలో జనాభా అక్కడకు తరలి వచ్చేలా మౌలిక వసతులు, రవాణా కల్పిస్తారు.
నూత రాజధాని కోసం తొమ్మిది నెలల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది. రాజధాని ఎంపిక తర్వాత రెండేళ్లలో భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని భావిస్తోంది. పర్యావరణానికి హానీ లేకుండా చూడాలనుకుంటోంది.
పనులు మొదలయ్యేలోగా పదిశాతం మంది ప్రభుత్వ అధికారులను కొత్త రాజధానికి తీసుకు రావాలని, అదే సమయానికి 5నుండి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించాలని చూస్తున్నారు. రాజధానిని ఐదేళ్లలో పది చ.కి.మీ. పరిధిలో అభివృద్ధి చేసి 45 వేల మందికి ఉపాధి కల్పించాలని, పదిహేనేళ్లలో 80 చ.కి.మీ. పరిధిలో అభివృద్ధి చేసి మూడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications