జగన్కి 'కాపు' షాక్: బాబుని తక్కువఅంచనా వేశారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చేరికల పైన ప్రత్యేకంగా దృష్టి సారించలేదా? వైసిపి అధినేత జగన్ వల్లే చేరికలకు తెరలేపారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
దాదాపు గత రెండేళ్లుగా తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తెరాసలో చేరుతున్నారు. అయితే ఏపీలో మాత్రం అలాంటి వాటి పైన చంద్రబాబు దృష్టి పెట్టలేదని అంటున్నారు. అయితే, ఇటీవల పార్టీ సమావేశాలలో చంద్రబాబు.. మాత్రం 2019లోగా జగన్ను ఫిక్స్ చేయాలని నేతలతో చెప్పారని తెలుస్తోంది.
అందుకు వైసిపి అధినేత జగన్ తీరే కారణమని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారంటున్నారు. 2019లోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చంద్రబాబు ఇటీవలే నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా అందుకు ప్లాన్ చేశారని అంటున్నారు.
అందులో భాగంగానే... ఇంతకుముందు కంటే భిన్నంగా వైసిపి పార్టీ నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారని చెబుతున్నారు. ఇరవై నెలల క్రితం ఎన్నికలు ముగియగానే ఓ ఎంపీ టీడీపీ వైపు వచ్చారు. కానీ ఆయనపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించలేదు.
అయితే, ఇటీవల జగన్ తీరు నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. సమాచారం మేరకు... వైసిపి అధినేత జగన్ ఇటీవల కుల రాజకీయాలను ఎగదోసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి బలంగా భావిస్తోంది. ముఖ్యంగా కాపు గర్జన వెనుక జగన్ హస్తం ఉందని భావిస్తున్నారు.

కులాల మధ్య చిచ్చు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారని భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు... జగన్ పైన ఎదురు దాడి ప్రారంభించారని అంటున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారని చెబుతున్నారు.
చేరికలతో జగన్కు నిద్రలేకుండా...
వైసిపి ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా జగన్ను మానసికంగా దెబ్బతీయాలని టిడిపి భావిస్తోందని తెలుస్తోంది. తద్వారా రాజకీయంగా కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుంది.
బాబును జగన్ తక్కువగా అంచనా వేశారా?
పార్టీ నేతలతో చంద్రబాబు ఓ సందర్భంలో మాట్లాడుతూ... 'నా శక్తిని జగన్ తక్కువగా అంచనా వేశారు. నేను అతనిని ఎలా దెబ్బతీస్తానో అతనికి తెలియడం లేదు. మరికొద్ది రోజుల్లో అతను నా సామర్థ్యాన్ని చూస్తారు.' అని పార్టీ నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో టిడిపి నేతలు చేరికల పైన జోరుగా ప్రచారం చేశారని, 2019లోగా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని నిత్యం చెబుతూ వస్తున్నారని, తద్వారా వైసిపి క్యాడర్ పైన మానసికంగా పై చేయి సాధించారని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా దెబ్బతీశారని అంటున్నారు.
చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ ఇటీవలే వైసిపి ప్రజాప్రతినిధుల పైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా చేరారు. త్వరలో మరికొందరు చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications