కిరణ్, జగన్ ఎఫెక్ట్: చిరంజీవి 'సిఎం' కోరిక తీరేనా?
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదివారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర నేతల్లో ఆశలు రేపుతున్నాయి. రాష్ట్రపతి పాలన పైన స్పష్టత రాలేదని, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని షిండే చెప్పారు. అదే సమయంలో అందుబాటులో ఉండాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి అధిష్టానం సూచించింది. ఈ నేపథ్యంలో చిరును ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో ఎక్కువగా ఉన్న కాపులను మచ్చిక చేసుకునేందుకు ఆ వర్గానికి చివరి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందంటున్నారు. రేసులో చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణలు ఉన్నారు. చిరంజీవికి మాత్రం అందుబాటులో ఉండాలని అధిష్టానం సూచించింది.

ఈ నేపథ్యంలో ఆయన వర్గంలో, అభిమానుల్లో, కాంగ్రెసు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చిరు అభిమానులు ఆయను ముఖ్యమంత్రిగా చూసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చిరుకు పిలుపు రావడం గమనార్హం. చిరు ప్రస్తుతం త్రివేంద్రంలో ఉన్నారు. ఆయన సోమవారం ఢిల్లీ చేరుకుంటారు. బొత్సకు కూడా పిలుపు రావడంతో ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
సీమాంధ్ర నుండి చిరు, కన్నా, ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణల, తెలంగాణలో దామోదర రాజనర్సింహ, జానా రెడ్డి, డి శ్రీనివాస్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీమాంధ్రలో ఓ బలమైన సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి కాపులకే ఇవ్వాలని, అందులోను చిరుకు ఇవ్వడం ఉత్తమమని అధిష్టానం భావిస్తోందట.
కిరణ్, జగన్ ఎఫెక్ట్
కాంగ్రెసు పార్టీలో ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం అనే ప్రచారం ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని మొదటి దెబ్బ తీశారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెసు పార్టీ సిద్ధమైనట్లుగా కనిపిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications