హైదరాబాద్ను వణికిస్తున్న చలిపులి: కారణం ఇదీ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును చలిపులి వణికిస్తోంది. గత ఆరేళ్ల కాలంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత హైదరాబాదులో ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారంనాడు హైదరాబాదులో 10.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
వచ్చే నాలుగైద రోజులు ప్రయాణికులు జాతీయ రహదారులపై అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు హెచ్చరించారు. పొగమంచు కళ్లు గప్పే ప్రమాదం ఉందని అంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇలా
ఆదిలాబాద్ జిల్లా కాశ్మీర్ను తలపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో, హైదరాబాద్ సహా చలి గాలులు వీస్తున్నాయి. ఖమ్మం, భద్రాచలం, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో చలి గాలులు భీతి గొల్పుతున్నాయి.
సూర్యోదయానికి ముందు ఇలా...
సూర్యోదయం కావడానికి ముందు హైదరాబాదులో చలి గరిష్టంగా ఉంటుంది లేదా ఉష్ణోగ్రత కనిష్టంగా నమోదవుతుంది. సూర్యాస్తమయం తర్వాత వేడిగా ఉంటుంది. పగలంతా సోలార్ రేడియేషన్ కారణంగా భూమి వేడెక్కడం వల్ల సాయంత్రానికి చలి తగ్గుతుంది.
రేడియేషన్ పూర్తయిన తర్వాత ఇలా...
ఆ తర్వాత క్రమంగా రేడియేషన్ క్రమంగా వెనక్కి మళ్లడం ప్రారంభమవుతుంది. రేడియేషన్తో శక్తి యావత్తు తరిగిన తర్వాత హిమాలయాల నుంచి చలిగాలి తెలంగాణలోకి వీచడం ప్రారంభమవుతుంది. దాంతో కనిష్టంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది.
ఉదాహరణకు ఇలా అవుతుంది...
గరిష్టంగా చలి ఉన్న గంటలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత ఉదయం 5.42 గంటలకు, 6.42 గంటలకు మధ్య నమోదైంది. సూర్యోదయానికి ముందు ఈ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత సూర్యకిరణాలు తాకడం వల్ల భూమి సోలార్ ఎనర్జీని తీసుకుంటూ వస్తుంది. సూర్యాస్తమయం తర్వాత దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. దాన్ని లాంగ్ వేవ్ రేడియేషన్ అని పిలుస్తారు.