జగన్తోనే స్టార్ట్: జంపింగ్స్పై ఢిల్లీ లైట్, 'టి' తర్వాతే
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ 30 నుండి 70 మంది వరకు ఎమ్మెల్యేలు, ఐదారుగురు మంత్రులు గోడ దూకేసే అవకాశం ఉందన్న వార్తలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏమాత్రం ఆందోళనకు గురి చేయటం లేదట. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తైన తర్వాతనే పార్టీ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తోందట.
విభజన ప్రతిపాదన మూలంగా కాంగ్రెస్ రెండుగా చీలుతుందని ముందే ఊహించామని, కాబట్టే ఫిరాయింపు వార్తలు ఆందోళనకు గురి చేయటం లేదని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారట. రాష్ట్రంలో ముఖ్యంగా సీమాంధ్రలో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్న మాట వాస్తవం. తెలంగాణ ఏర్పాటు నిర్ణయానికి ముందే సీమాంధ్రలో కాంగ్రెస్ ఇరకాటంలో పడిందని వారంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడే మొదట ఓదార్పు యాత్రలు నిర్వహించటం, తరువాత సొంత పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి సీమాంధ్రలో కాంగ్రెస్కు గడ్డుకాలం ప్రారంభమైందని అంటున్నారు.

రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తరువాత సీమాంధ్రలో తమ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందంటున్నారు. ఈ నేపథ్యంలో 30, 40మంది ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు జగన్ పార్టీ లేదా తెలుగుదేశం గూటికి చేరొచ్చన్న విషయాన్ని ముందే ఊహించామని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు లేదా అసెంబ్లీకి ఎన్నిక కావాలి, పదవుల్లో ఉండాలని అనుకునే వారు పార్టీ సిద్ధాంతాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండరన్న వాస్తవం తమకు తెలియంది కాదని చెబుతున్నారట.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపించే సమయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని వారు అంగీకరిస్తున్నారట. సీమాంధ్రకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లోకి దూకే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయనీ వారే చెబుతున్నారు. విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగవుతుంది కానీ, సీమాంధ్రలో అంతంత మాత్రమేననేది తాము అంచనా వేసిందేనని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.
సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు హైకమాండ్ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జనవరి నెలలో సీమాంధ్ర పర్యటనకు వెళ్లటం వెనుకనున్న ఉద్దేశం కూడా ఇదేనని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. అసలు సిసలైన కాంగ్రెస్వాదులు పార్టీని వదిలిపెట్టిపోతారని తాము భావించటం లేదని అంటున్నారు.
ఇతర పార్టీల నుంచి పదవుల కోసం కాంగ్రెస్లో చేరిన వారు, మళ్లీ తమ పాత పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యపోవాల్సింది ఏముందంటున్నారట. రాష్ట శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్సిన ప్రక్రియ ముగిసిన తరువాతే, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఫిరాయింపులపై ఆలోచించవచ్చునని అధిష్టానం భావిస్తోందట.
మరోవైపు, కాంగ్రెస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు, ఐదారుగురు మంత్రులు, కొందరు ఎంపీలు పార్టీ ఫిరాయించవచ్చంటూ వస్తున్న వార్తలు చివరకు నిజం కాకపోవచ్చని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చెప్పారు. సందీప్ సోమవారం ఏఐసిసిలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతోందని, చర్చల ప్రక్రియ ముగిసిన తరువాత పరిస్థితిని అంచనా వేస్తామని చెప్పారు.
ఫిరాయింపు అనుమానాన్ని సాక్షాత్తూ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రకటించారన్న మీడియా ప్రశ్నకు రాష్ట్రం నుంచి వస్తున్న ఇలాంటి వార్తలు కొన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై చర్చ జరిగిన అనంతరం, పార్టీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిని అడగాల్సి ఉంటుందని సందీప్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications