టిడిపి వైపు మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు

విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిన తర్వాత వీరంతా విడతల వారీగా అధికారికంగా పసుపు పచ్చ కండువా కప్పుకుంటారని అంటున్నారు. సమాచారం ప్రకారం ఆ పార్టీ వైపు చూస్తున్న వారిలో నలుగురు రాష్ట్ర మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వీరి సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి చేరికలు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
వీరిలో కొందరు ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లు కాకుండా వేరే సీట్లను కోరుకొంటూ వస్తున్నారు. ఒక మంత్రి, ఒక ఎంపీ వీరిలో ఉన్నారు. మరో ముఖ్య నేత తాను రంగం నుంచి తప్పుకొని తన కుటుంబ సభ్యుడిని రంగంలోకి తెస్తున్నారు. ఈ మార్పులు చేర్పులపై టిడిపి అధిష్ఠానం వద్ద ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. ఆ పార్టీ నాయకత్వం కూడా దీనికి ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన సమయంలో చోటు చేసుకొన్న వలసలతో కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో టిడిపికి నాయకత్వ సమస్య ఏర్పడింది.
అలాంటి చోట్ల మంచి నాయకులు వస్తానంటే ఆ పార్టీ స్వాగతం పలుకుతోంది. అలాగే, వివిధ కారణాలతో నెల్లూరు, కర్నూలు వంటి జిల్లాల్లో ఆ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కొరత ఏర్పడింది. ఇటువంటి చోట్ల కూడా తాము అనుకొంటున్న స్థాయి నేతలు వస్తే స్వాగతించడానికి టిడిపి వర్గాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో టిడిపి వైపు చూస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య అరడజనుకు పైగానే ఉందట. కొన్ని నియోజకవర్గాల్లో తమకు బలమైన నాయకత్వం ఉన్నందున అక్కడ వేరే వారిని తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.
రాయలసీమలో ఒక సామాజిక వర్గం, కోస్తాలో మరో సామాజిక వర్గం నుంచి వచ్చేవారికి ఆ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందట. టిడిపి వైపు చూస్తున్నట్లు వినవస్తున్న మంత్రుల్లో ముగ్గురు రాయలసీమ నుంచి ఒకరు కోస్తా నుంచి, ఇద్దరు ఎంపీల్లో ఒకరు కోస్తా నుంచి మరొకరు రాయలసీమ నుంచి, పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల్లో నలుగురు రాయలసీమ నుంచి పదహారు మంది కోస్తా నుంచి ఉన్నట్లు సమాచారం.
తమతో సంప్రదింపుల్లో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను ఖరారు చేయకుండా పెండింగ్లో ఉంచారట. పార్టీ అంతర్గత సమావేశాల్లోను బాబు సమర్థులైన వచ్చే వారిని ఆహ్వానిద్దామని చెబుతున్నారట. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు టిడిపికి వచ్చే అవకాశముందంటున్నారు.












Click it and Unblock the Notifications