ఏపీ ప్యాకేజీపై నేడు చర్చ: కేంద్రమంత్రుల హాజరు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ, ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక ప్యాకేజీపై తేల్చాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని చంద్రబాబు కోరారు.
ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి, వ్యయ, రెవెన్యూ కార్యదర్శులు, వాణిజ్య కార్యదర్శులూ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నవ్యాంధ్రకు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కూడా చట్టంలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాష్ట్రంలో పారిశ్రామీకరణకు పన్నుల ప్రోత్సాహం, రూ. 24,350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు 2014-15 ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధికలోటు రూ. 24,811 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా రాష్ట్రానికి అందించాలని తొలి నుంచి రాష్ట్రం కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని కంపెనీలను ఆహ్వానించాలంటే అసలు ఏమేరకు రాయితీలు ఇస్తామనేది స్పష్టం కావాల్సి ఉందని, రాయితీల గురించి కేంద్రం వెంటనే తేల్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు, నవ్యాంధ్రకు పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో నవ్యాంధ్రకు రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సందర్భాల్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు.