ఏపీకి షాక్ : ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ టాప్
న్యూఢిల్లీ : ఉమ్మడి కుంపటి నుంచి వేరుపడ్డాక.. ప్రతీది పోలికల పరంపరే. పాలకులు సమవుజ్జీలు కావడంతో ఇద్దరి మధ్య పోటీని బేరీజు వేయడానికి పనితీరును ఆధారంగా తీసుకోవడం.. దాన్ని బట్టే మార్కుల చిట్టాను తయారు చేయడం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకో పరీక్షలా మారింది. ఇదే తరహాలో కేంద్ర వాణిజ్య పన్నుల విభాగం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఆర్థిక సంస్కరణల ఆధారంగా కేంద్ర వాణిజ్య విభాగం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా..! ఏపీకి రెండవ స్థానం దక్కడం గమనార్హం. ఆర్థిక సంస్కరణల రూపకల్పనకు ఈ ఏడాదికి గాను ఈవోడీబీ ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రానికి 60.24 శాతం మార్కులు దక్కగా, ఏపీ 55.75 శాతానికి పరిమితమైంది.
తాజా 'ఈజ్ ఆఫ్ డూయింగ్' నివేదికల గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలసిందే. ఏపీ సర్కార్ తమ ప్రణాలికను కాపీ కొట్టిందంటూ.. తెలంగాణ ప్రభుత్వం పలు ఆరోపణలు చేయగా..! తాజా ర్యాంకులు ఏపీకి ఒకింత షాక్ గానే పరిణమించాయి.
ర్యాంకులను ఎలా ప్రకటిస్తారు..?
ఆయా రాష్ట్రాల్లో విదేశీ పెట్టుబడులకు గల అనుకూల పరిస్థితులు, అందుకోసం అక్కడి ప్రభుత్వాలు చూపిస్తోన్న చొరవ.. ప్రత్యేక ఆర్థిక సంస్కరణల రూపకల్పన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రపంచ బ్యాంక్ ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది ఈఓడిబీ. ఇక గతేడాది సెప్టెంబర్ లో ప్రకటించిన ర్యాంకులను పరిశీలిస్తే.. ఆ జాబితాలో ఏపీ రెండో స్థానాన్ని దక్కించుకోగా.. తెలంగాణ 13 వ స్థానంలో నిలిచింది.
ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో 'డిప్' (బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్) పేరుతో ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విధానం ద్వారా మొత్తం 340 ప్రశ్నలను ఆన్ లైన్ లొ ఉంచే డ్రిప్.. ర్యాంకులు ఆశించే రాష్ట్రాల నుంచి సమాధానాలను కోరుతోంది.
ప్రశ్నలను అనుసరించి ఆయా రాష్ట్రాలు సమర్పించే సమాధానాల ఆధారంగా వాటికి ర్యాంకులు కేటాయిస్తోంది. ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు ఆన్ లైన్ డ్యాష్ బోర్డు అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది కేంద్రం. ఇక తాజా ర్యాంకులకు సంబంధించిన సులభ ఆర్థిక సంస్కరణలను సమర్పించడానికి జూన్ 30ని గడువు తేదీగా ప్రకటించిన డిప్.. అనంతరం వెబ్ పోర్టల్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంతో గడవును జూలై 7వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పరిశీలనలో మాత్రం జూన్ 30వ తేదీ వరకు చేపట్టిన ఆర్థిక సంస్కరణలనే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది డిప్.