వీవీఐపీల ఫోన్ల ట్యాపింగ్: ఎస్సార్పై ఫిర్యాదు, అసలేం జరిగింది?
న్యూఢిల్లీ: ఇప్పటికే పలు వివాదాలను ఎదుర్కొంటున్న పారిశ్రామిక సంస్ధల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్ తాజాగా ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణల్లో ఇరుక్కుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులతో సహా పలువురు వీవీఐపీల ఫోన్లను ఎస్సార్ గ్రూప్ ట్యాప్ చేసినట్టుగా ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
2001 నుంచి 2006 మధ్య కాలంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి కార్యాలయం సహా, ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పలువురు రాజకీయ నాయకులు, వీవీఐపీల ఫోన్లను ఎస్సార్ గ్రూప్ ట్యాప్ చేసిందని దీనిపై విచారణ జరపాలని ప్రధాని నరేంద్రమోడీకి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి తన క్లయింట్ అందజేసిన పలు రాతప్రతులు, టేప్లను ఆయన బయటపెట్టారు. మొత్తం 29 పేజీల ఫిర్యాదును జూన్ 1న ప్రధాని కార్యాలయానికి సురేన్ అందజేశారు. తాను తన క్లయింట్ అల్బసీత్ ఖాన్ తరఫున ప్రధానికి ఫిర్యాదు పత్రాన్ని అందజేసినట్టు సురేన్ వెల్లడించారు.
ఎస్సార్ టెలికామ్లో పనిచేసిన అల్బసీత ఖాన్ సంస్థ యాజమాన్యం పురమాయింపుపై ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించినట్టు న్యాయవాది తెలిపారు. ఈ ట్యాపింగ్ జరిగిన సమయంలో ఖాన్ ఎస్సార్ గ్రూప్లో సెక్యూరిటీ హెడ్గా ఉండేవారని ఆయన పేర్కొన్నారు.
టెలికామ్ కంపెనీగా ప్రభుత్వానికి చట్టపరంగా తాము సహకరించాల్సి ఉంటుందని అందులో భాగంగా ప్రభుత్వం సూచించిన వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి సంభాషణలను రికార్డు చేయాలని ఎస్సార్ గ్రూప్ యజమానులు రవి రుయా, శశి రుయా, ప్రశాంత రుయా తన క్లయింట్కు చెప్పారని ఆయన వివరించారు.
యాజమాన్యం ఆదేశాలు మేరకు ఖాన్ ఫోన్లను ట్యాప్ చేసి సంభాషణల రికార్డు చేసేవారని వెల్లడించారు. వేలాది సంభాషణలకు సంబంధించిన వందలాది ఆడియో కాసెట్స్ను ఖాన్ రుయాలకు అందించినట్టు తెలిపారు. ఎస్సార్ గ్రూప్ ఫోన్ల ట్యాప్ చేసిన వారిలో మంత్రులు ప్రఫుల్ పటేల్, రామ్ నాయక్, సురేష్ ప్రభు, పీయుష్ గోయల్లతో పాటు పారిశ్రామిక వేత్తలైన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తదితరుల ఉన్నారని మోడీకి రాసిన లేఖలో ఆయన ఆరోపించారు.
వీరితో పాటు ఐడీబీఐ బ్యాంకు మాజీ చైర్మన్ పీపీ ఓరా, ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ కేవీ కామత్, జాయింట్ ఎండీ లలితా గుప్తే, అమితాబ్ బచ్చన్, హోం సెక్రటరీ రాజీవ్ మహర్షి, అప్పట్లో ప్రధాని కార్యాలయంలో ఉన్న బ్రిజేష్ మిశ్రా, ఎన్కె సింగ్, పార్లమెంట్ సభ్యుడు అమర్సింగ్, బీజేపీ నేతలు కిరీటి సోమయ్య, జస్వంత సింగ్, సహారా అధిపతి సుబ్రతారాయ్ తదితరుల ఫోన్లూ ట్యాప్ అయ్యాయని, పూర్తి విచారణ జరిపించాలని కోరారు.
అయితే సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ ఆరోపణలను ఎస్సార్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది.