బెజవాడ వర్రీ: తుపాకుల సంస్కృతి హోరు
విజయవాడ: గతంలో ముఠా కక్షలతో అట్టుడికిన విజయవాడ ఇప్పుడు తుపాకుల మోతతో తల్లడిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లో ఏర్పడుతుందనే ప్రచారం మొదలైనప్పటి నుంచి ఈ సంస్కృతి పెరిగినట్లు కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో తొలిసారిగా ఇటీవల తుపాకీ సంస్కృతి ఆందోళనకు గురిచేస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం జాతీయ రహదారిపై పట్టపగలు బిహారీల తుపాకులకు ఇద్దరు కుమారులతో తండ్రి బలికాగా, నేడు హైదరాబాదీ తుపాకీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత హతమయ్యాడు. ఈ రెండు పరిణామాలతో కృష్ణా జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ రెండింటికీ ఆస్తి వివాదాలే కారణం కావటం గమనార్హం. ఈ రెండు సంఘటనల్లోనూ కరడుగట్టిన కిరాయి హంతకులే పాల్గొన్నారు. గత నెల 24న గన్నవరం విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై కారులో వెళ్తున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన గంధం మారయ్య, పగిడి వీరయ్య, వారి తండ్రి నాగేశ్వరరావుపై బీహారీలు ఒకేసారి రెండు రివాల్వర్లతో కాల్చి హతమార్చారు. తాజాగా నందిగామలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, జాతీయ ఉక్కు వినియోగదారుల మండలి మాజీ సభ్యుడు బొగ్గవరపు శ్రీశైలవాసు తన షోరూంలో దాదాపు ఐదారుగురితో కలిసి మాట్లాడుకుంటున్న సమయంలోనే నిందితులు సినీ ఫక్కీలో తుపాకీతో కాల్పులు జరిపి బైక్పై పరారయ్యారు.
పరారైన ప్రధాన నిందితుడు ఉన్నం హనుమంతరావు హతునికి సమీప బంధువు కావటంతో ఆర్థిక పరమైన విభేదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం 1991లో విజయవాడ నగరం నడిబొడ్డున పుష్పా హోటల్ సెంటర్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఇమ్మానియేల్ రాజును దుండగులు కాల్చివేయడంతో జిల్లాలో తుపాకీ సంస్కృతికి తెరలేచింది.
తిరిగి 1998లో మొగల్రాజపురం సిటీ కేబుల్ ఎండి పొట్లూరి రామకృష్ణను దుండగులు కాల్చి చంపారు. తిరిగి 1999లో విజయవాడ వన్టౌన్లో సర్జికల్ వ్యాపారి కాటంరాజు లక్ష్మీనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తొలుత హంతకులెవరో తెలియనప్పటికీ ఆ తర్వాత కరీంనగర్లో జరిగిన అజం ఘోరి అనే నేరస్థుడు ఎన్కౌంటర్తో ఈ హత్య కేసు చిక్కుముడి వీడింది. అక్కడ లభించిన డైరీ ఆధారంగా అతనే కిరాయి హంతకుడిగా తేలింది.
2001లో రమేష్ ఆసుపత్రి రోడ్డులో తుపాకీ కాల్పులు జరిగాయి. అయితే ఎవరూ గాయపడలేదు. 2004లో ఓ సినీ నటుని అభిమానులమంటూ బృందావన్ కాలనీలో ఉండే టిడిపి నేత కాట్రగడ్డ బాబుపై ఆయన ఇంట్లోనే కొందరు యువకులు కాల్పులు జరిపారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ముప్పుతప్పింది. 2006లో విజయవాడ కోర్టుల వద్ద జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి.
వాయిదాకు వచ్చిన వంగవీటి శంతన్కుమార్పై కొందరు కాల్పులు జరపగా కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. దీని వెనక బిహారీ కిరాయి ముఠా ఉన్నట్లు తేల్చారు. ఇంకా ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇటీవల తన ప్రేయసి భర్తను చంపేందుకు తుపాకీతో విజయవాడ బస్ స్టేషన్కు వచ్చిన ఓ పూజారి చేతిలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలింది. అయితే అతను ఒక్కడే స్వల్పంగా గాయపడ్డాడు. మొత్తం మీద విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో గన్ కల్చర్ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.