చైన్ స్నాచర్ల ఫ్యామిలీ: కర్ణాటకలో భారీ అస్తులు
హైదరాబాద్: ఇరానీ కుటుంబంలోని సభ్యులంతా గొలుసు చోరీలనే వృత్తిగా ఎంచుకుంది. కుటుంబంలోని తండ్రితో పాటు కుమారులు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ కర్ణాటకలో భారీ ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో వీరు చోరీలకు పాల్పడినట్లు సమాచారం. వారందరిపై 30కి పైగా కేసులు నమోదై ఉన్నాయి.
నిరంతర నిఘా, పెరిగిన గల్లీ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్తో పోలీసులకు ఈ ఇరానీ గ్యాంగ్ కుటుంబం గుట్టు దొరికింది. పోలీసులకు దొరకకుండా ఈ కుటంబం సైబరాబాద్ పరిధిలో 30కి పైగా కేసుల్లో విరుచుకుపడి మహిళ మెడలలోంచి బంగారం పుస్తెలతాడులను ఎత్తుకెళ్లారని తేలింది. ఈ కుటుంబం లోని అందరూ చైన్ స్నాచింగ్ కేసుల్లో నమోదు కావడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తండ్రి ఇళ్ళలో దొంగతనాలు చేసే నేరగాడిగా, నలుగురు కుమారులు స్నాచింగ్లకు పాల్పడుతూ మూడు రాష్ర్టాల పోలీసులకు వాంటెడ్గా మారారు.
మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ర్టాల్లో ఈ గ్యాంగ్ పనిచేస్తోంది. కర్నాటక బీదర్ ప్రాంతంలో నివసించే ఈ గ్యాంగ్ కారు, రైలు, విమానాల్లో నగరానికి వచ్చి ఆ తర్వాత సెకండ్ హ్యాండ్లో ద్విచక్ర వాహనాన్ని కోనుగోలు చేస్తారు. ఆ తర్వాత వాటిపై ఒకే రోజు నాలుగు నుంచి ఐదు స్నాచింగ్లకు పాల్పడి తిరిగి కారులో లేదా ట్రైన్లలో వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో ఇక్కడ కోనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని తిరిగి ఇక్కడే తక్కువ ధరకే అమ్మేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
ఇటీవల హైదరాబాదులోని ఎల్బీనగర్ జోన్ పరిధిలో రహదారి మీద ఓ చైన్ స్నాచింగ్ జరిగింది. ఆ సమయంలో నిందితుడి సెల్ఫోన్ కింద పడింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని ఆరా తీశారు. ఈ విచారణలో పోలీసులకు ఇరానీ గ్యాంగ్కు సంబంధించిన క్లూ దొరికింది. దాన్ని పట్టుకుని వెంటాడిన పోలీసులకు గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తి దొరికాడు. అతన్ని విచారించగా వారి కుటుంబం భాగోతం బయటపడింది. ఆ కుటుంబంలో తండ్రి, నలుగురు కుమారులు నేరాలకు పాల్పడుతూ కర్నాటకలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది.
సైబరాబాద్ పోలీసులకు దొరికిన ఒకరిని పోలీసులు రిమాండ్కు తరలించి అతనిని తిరిగి కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. మొత్తానికి ఈ గ్యాంగ్ సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 50కి పైగా స్నాచింగ్లకు పాల్పడిందని పోలీసులకు ఆధారాలు లభించాయి. పోలీసుల అరెస్టు చేసిన వ్యక్తి తో పాటు అతని సోదరులు ఇంకా చాలా కేసుల్లో నిందితులుగా చిక్కే అవకాశం ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు.
ఈ విచారణలో గ్యాంగ్ లీడర్ మహారాష్ర్టాల్లో పట్టుకునేందుకు వచ్చినప్పుడు ఓ పోలీసు అధికారిపై కత్తితో దాడి చేసి పరారైనట్లు సమాచారం. ఇంకా ఆ ఇద్దరు దొరికితే సైబరాబాద్ పోలీసులు ఊహించని రికవరీ చేసే అవకాశం ఉంది.
బెంగళూరులో ముగ్గురు అరెస్టు
బెంగళూరు నగరంలో విచ్చలవిడిగా చైన్ స్నాచింగ్ లు చేస్తున్న ఇరానీ గ్యాంగ్ లోని ముగ్గురిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 60 లక్షల విలువైన బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
ధారవాడలోని జన్నత్ నగరలోని ఇరానీ కాలనీకి చెందిన అబుజర్ ఆలీ (26) అబ్దుల్ హాసన్ (23), హాసన్ జిల్లాలోని హళే నరసీపురకు చెందిన గిరీష్ (38) అనే ముగ్గురిని అరెస్టు చేశామని సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసులు అన్నారు.