పంజాబ్ జట్టు బాస్: ప్రీతి జింటాకు ఇదే లాస్ట్?
న్యూఢిల్లీ: ఐపియల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సంబంధించి బాలీవుడ్ నటి ప్రీతి జింటా పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఐపియల్ మ్యాచుల సందర్భంగా తమ జట్టు ఆడే ప్రతి మ్యాచుకూ దాదాపు ఆమె హాజరవుతోంది. కింగ్స్ ఎలెవన్ జట్టులో ఎక్కువగా భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఉన్నారు.
ఐపియల్ ప్రారంభమైన 2008 నుంచి కూడా ప్రీతి జింటా పంజాబ్ జట్టు విషయంలో ముందు భాగాన ఉంటూ వస్తోంది. అయితే, ఐపియల్ ఎనిమిదో ఎడిషన్ ఆమెకు చివరిది కావచ్చునని అంటున్నారు. తనకు ఇంకెంత మాత్రం ఐపియల్ అవసరం లేదని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ఆమె. జట్టుకు సంబంధించి విధాన నిర్ణయాల్లో ఆమెనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆటగాళ్ల వేలం సమయంలో ఆమెనే కనిపిస్తూ వస్తున్నారు. సహ యజమాని, బాయ్ ఫ్రెండ్ నెస్ వాడియా వెనకనే ఉంటూ వస్తున్నారు.
క్రికెట్ జట్టు యజమానిగా ప్రీతి జింటా విజయం సాధించినట్లేనని జాతీయ మీడియా కూడా వ్యాఖ్యానిస్తోంది. ఆమెను బెట్టింగ్, ఫిక్సింగ్ వంటి నీలినీడలు తాకలేదు.
ఆ సమయంలో అంటే 2008లో క్రికెట్పై దృష్టి సారించాలని అనుకున్నాని, నటన అలా వెళ్లి ఇలా చేయవచ్చునని, క్రికెట్కు సంబంధించి కొత్త వ్యాపారం కాబట్టి చాలా చేయాల్సి ఉంటుందని ప్రీతి జింటా అన్నారు.
ఇక ఐపియల్ తనకు ఎంత మాత్రం అవసరం లేదని, ఇప్పుడు తాను వచ్చి కేవలం ఆట చూస్తున్నానని, వ్యవహారాలు సాఫీగా సాగుతున్నాయని, జట్టు బాగా ఆడుతోందని, అన్ని చక్కబడ్డాయని, ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించాలని అనుకుంటున్నానని ఆమె ఆ ఇంటర్య్యూలో చెప్పారు.