జగన్ సమైక్యం, కిరణ్ తిరుగుబాటు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దేశమంతా తిరుగుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను అడ్డుకోవడానికి హైదరాబాదులో వ్యూహరచనలు చేస్తున్నారు. శుక్రవారం వైయస్ జగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆయన అఖిలేష్ యాదవ్ను కోరారు. చిన్న రాష్ట్రాలకు సమాజ్వాదీ (ఎస్పీ) వ్యతిరేకం కావడంతో సహజంగానే ఆయనకు అఖిలేష్ యాదవ్ మద్దతు లభించింది.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వెళ్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర శాసనసభకు ముసాయిదా బిల్లు వస్తే ఎలా అడ్డుకోవాలనే విషయంపై ఆయన శుక్రవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
దాదాపు 30 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. రాష్ట్ర శాసనసభలో బిల్లుకు వ్యతిరేకంగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ జగన్ను, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులను కూడగట్టే ప్రణాళికను కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అఖిలేష్ యాదవ్తో జగన్..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో వ్యవహరించాలని కోరడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను లక్నోలో కలిశారు. ఆయనకు అఖిలేష్ యాదవ్ మద్దతు లభించింది.
ఈ అనుబందం ఇప్పటిది కాదు..
జగన్తో తమ అనుబంధం ఇప్పటిది కాదని అఖిలేష్ యాదవ్ మీడియాతో అన్నారు. తాము చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అఖిలేష్ యాదవ్ మీడియాతో చెప్పారు.
ఆర్టికల్ 3 దుర్వినియోగం..
రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనేది జనగ్ ప్రధాన ఆరోపణ. దాన్ని సవరించేలా ఒత్తిడి తేవాలని ఆయన జాతీయ పార్టీల నేతలను జగన్ కోరుతున్నారు.
కాసు వెంకటకృష్ణా రెడ్డి ఇలా..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై శుక్రవారంనాడు సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో చర్చించారు. సమావేశానంతరం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి
మంత్రి టిజి వెంకటేష్ ఇలా..
రాష్ట్ర విభజనను వ్యతిరేకించడానికి తాము యుద్ధం చేస్తామని టిజి వెంకటేష్ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానంతరం చెప్పాం. ఈ యుద్ధంలో తాము గెలుస్తామని ఆయన అన్నారు.
మంత్రి శైలజానాథ్ ఇలా..
శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై ఓటింగుకు పట్టుబడుతామని, ఇతర సీమాంధ్ర శాసనసభ్యులను కూడా కలుపుకుని పోరాటం చేస్తామని మంత్రి శైలజానాథ్ చెప్పారు.