ఎంజీఆర్ అంత్యక్రియల్లో.. జయను కొట్టి.. కిందకు నెట్టి(వీడియో)
తన రాజకీయ గురువు ఎంజీఆర్ మరణించినప్పుడు జయలలిత జీవితంలో అత్యంత విషాదకర, అవమానకర సంఘటన చోటు చేసుకుంది.
చెన్నై: అమ్మ మరణం తర్వాత.. ఆమె రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సంక్షోభాలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తన రాజకీయ గురువు ఎంజీఆర్ మరణించినప్పుడు జయలలిత జీవితంలో అత్యంత విషాదకర, అవమానకర సంఘటన చోటు చేసుకోవడం.. ఆ తర్వాత అదే తన రాజకీయ జీవితాన్ని మలుపు తిట్టడం జయ జీవితంలో కీలక పరిణామం.

స్నేహితురాలి ద్వారా తెలుసుకుని..
ఎంజీఆర్ మరణవార్తను తన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న జయలలిత.. ఆయన పార్థివ దేహాన్ని చూడటం కోసం తొట్టంలోని ఆయన ఇంటికి బయలుదేరారు. అయితే అప్పటికే జయను ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఇంటి వెనక పక్కనున్న గేటు నుంచి లోపలికి వెళ్లారు జయలలిత.

అంబులెన్స్ ను ఫాలో అవుతూ..:
అప్పటికీ ఆమెను లోపలికి రావడానికి అనుమతించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎంజీఆర్ పార్థివ దేహాన్ని రాజాజీ హాల్ కు అంబులెన్స్ లో తరలించడానికి సిద్దమయ్యారు. దీంతో అంబులెన్స్ ను ఫాలో అవాల్సిందిగా జయ తన కారుకు డ్రైవర్ కు చెప్పారు. అక్కడ దాదాపు 13గం.ల పాటు తన అభిమాన నేత పార్థివ దేహం వద్దనే కూర్చున్నారు జయలలిత.

ఎంజీఆర్ పార్థివ దేహం పక్కన్నే:
పార్థివ దేహాన్ని ఉంచిన మరుసటిరోజు.. పక్కనున్న మహిళలు తనను గోళ్లతో గిల్లడం, కాళ్లను తొక్కడం, చర్మంపై గుచ్చడం వంటి ఇబ్బందికర పరిణామాల్ని జయ ఎదుర్కొన్నారు. అయినా ఆమె మాత్రం పార్థివ దేహం పక్కనుంచి కదలలేదు. ఇక అక్కడినుంచి అంత్యక్రియల కోసం ఆయన పార్థివ దేహాన్ని తరలించడానికి సిద్దమైన తరుణంలో జయకు ఘోర అవమానం ఎదురైంది.
వాహనం నుంచి నెట్టేసి (వీడియో)
ఎంజీఆర్ పార్థివదేహాన్ని తరలిస్తున్న వాహనంలో జయ ఎక్కడానికి ప్రయత్నించారు. డ్యూటీలో
ఉన్న పోలీసులు ఓ చేయి కూడా అందించారు. అయితే జయ అలా పైకి ఎక్కారో లేదో..అక్కడే ఉన్న ఎమ్మెల్యే డాక్టర్.కె.పి.రామలింగం జయపై కేకలు వేస్తూ ఆమె మీదకు వచ్చాడు. ఇంతలోనే ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ తమ్ముడు కొడుకు, నటుడు దీపన్ జయను వద్దకు వచ్చి ముఖంపై దాడి చేశాడు. వాహనం నుంచి కిందకి నెట్టేశాడు. దీంతో జయకు స్వల్ప గాయాలయ్యాయి.

అసభ్య పదజాలంతో దూషించి..
అయితే అక్కడితో జయకు జరిగిన అవమానం ఆగిపోలేదు. ఆ తర్వాత అసభ్య పదజాలంతో ఆమెను దూషించడంతో.. జయ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘోర అవమానకర ఘటనను జీర్ణించుకోలేక ఎంజీఆర్ అంత్యక్రియలకు జయ దూరంగానే ఉండిపోయారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ తో ఇంటర్వ్యూ సందర్బంగా.. తనకు జరిగిన ఈ అవమానాల గురించి చెప్పుకుంటూ తీవ్రంగా కలత చెందారు జయలలిత.

కీలక మలుపు అదే:
ఎంజీఆర్ అంత్యక్రియల్లో జయలలితకు జరిగిన అవమానాన్ని కొంతమంది పార్టీ నేతలు కూడా తీవ్రంగా పరిగణించారు. అన్నాడీఎంకె కార్యకర్తలు,నేతలు, ఎంపీలు, ఎమ్యెల్యేలంతా జయ ఇంటికి క్యూ కట్టారు. ఎంజీఆర్ వారసురాలిగా మీకే మా మద్దతు అంటూ జయకు అండగా నిలబట్టారు.
దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. జయ వైపు నిలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం..విశ్వాస పరీక్షలో జానకీ రామచంద్రన్ నెగ్గడం నాటకీయంగా జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని జయ గవర్నర్ ను కోరడం.. అప్పటి రాజీవ్ గాంధీ సర్కార్ తమిళనాడు అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడం జరిగిపోయాయి.












Click it and Unblock the Notifications