అప్పుడే ఏడాది!: జయ కన్నుమూసి!.., అనూహ్య మలుపులతో ఇలా తమిళ రాజకీయం..
Recommended Video
చెన్నై: అప్పుడే ఏడాది గడిచిపోయింది. నేటితో జయలలిత కన్నుమూసి సంవత్సరం పూర్తయింది. అత్యంత నాటకీయ పరిణామాల నడుమ మిస్టరీ డెత్ గా ముద్రపడ్డ జయ మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు. వైద్య బృందాలు క్లారిటీ ఇచ్చినా.. ప్రభుత్వం జయలలిత చికిత్స వివరాలను వెల్లడించినా.. ఆ అనుమానాలు ఎప్పటికీ తొలగిపోయేలా లేవు.
ఇదంతా పక్కనబెడితే.. జయ మరణం రాజకీయంగా తమిళనాడును ఎన్ని మలుపులు తిప్పుతుందో చూస్తూనే ఉన్నాం. జయలలిత అనుసరించిన నియంత పోకడలతో ఆమె ఉన్నన్నాళ్లు పార్టీలో మరో నేత ఎదగలేకపోయాడనేది వాస్తవం. ఆమె మరణం తర్వాత వారసుల పేరిట ఆ పేచీ మొదలైంది. ఇటు బయోలాజికల్ వారసులం తానేనంటూ అమృత అనే యువతి కూడా తెర పైకి వచ్చింది.
కన్నుమూసిన వారానికే:
అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవించడం జయలలిత జీవితంలో అత్యంత చేదు అనుభవం. ఆమె మరణం తర్వాత ఐటీ అధికారులు జయలలిత సన్నిహిత వర్గాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. ఆమె కన్నుమూసిన వారం రోజులకే వీఐపీలతో పాటు ఏకంగా సచివాలయంలో, ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి నివాసంలోనే సోదా లు చేపట్టింది. తమిళనాడు ప్రత్యేక రాష్ట్రంగా తర్వాత ఐటీ అధికారులు సచివాలయంలోకి అడుగుపెట్టడం అదే ప్రథమం.
శశికళ వర్సెస్ పన్నీర్:
జయలలిత మరణంతో అన్నాడీఎంకెలో ఏర్పడ్డ రాజకీయ అగాథాన్ని పూడ్చడానికి పన్నీర్ సెల్వం-శశికళ మధ్య రసవత్తర పోరు జరిగింది. అనూహ్య పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించి.. సీఎం పీఠంపై శశికళ కన్నేసింది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. పన్నీర్ సెల్వం శశికళపై ఎదురు తిరగడంతో ఆమెకు కష్టాలు తప్పలేదు. దానికి తోడు అదే సమయంలో అక్రమాస్తుల కేసులో తీర్పు రావడంతో.. సీఎం పీఠాన్నే గురిపెట్టిన శశికళ కాస్త ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వస్తోంది.
అనూహ్యంగా 'పళనిస్వామి':
జైలుకెళ్లేముందు శశికళ నడిపిన రిసార్డు రాజకీయంతో పళనిస్వామి అనూహ్యంగా తెరపైకి రావడం.. సీఎం సీటులో కూర్చోవడం జరిగిపోయాయి. తనకు అనుయాయిగా ఉంటాడనుకున్న పళనిస్వామి సైతం శశికళను పక్కనబెట్టి పన్నీర్ సెల్వంతో కలిసిపోయారు. టీటీవి దినకర్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడమే పళనిస్వామి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపేదాకా వెళ్లింది. ఆర్కేనగర్ ఉపఎన్నికలో డబ్బులు పంచుతూ దినకరన్ దొరికిపోవడంతో పార్టీ ప్రతిష్ట మంటకలిసిపోయింది. దీంతో పళనిస్వామి సైతం దినకరన్, శశికళను పక్కనపెట్టక తప్పలేదు.
బీజేపీ ఎత్తులు:
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితికి ప్రధాన కారణం బీజేపీయే అన్నవారు లేకపోలేదు. అన్నాడీఎంకె నేతలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే తెర వెనుక ఇంత తతంగం నడిపించారని, తత్ఫలితంగానే శశికళ జైలుకు వెళ్లిందనేది వారి వాదన. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే తమిళనాడు వంటి రాష్ట్రంలో పాగా వేసేందుకు ఎప్పటినుంచో ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. అమ్మ మరణాన్ని అందుకు అనువుగా మార్చుకునేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
కేంద్రాన్ని వ్యతిరేకించి:
దేశమంతా ఆహార భద్రతా చట్టం అమలులోకి వచ్చినా తమిళనాడులో మాత్రం ఆలస్యంగా అమలులోకి వచ్చింది. కారణం జయలలిత దీన్ని వ్యతిరేకించడమే. అదొక్కటే కాదు.. కేంద్ర నిర్ణయాలను జయలలిత పలుమార్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నీట్ పరీక్షల విషయంలోను, ర్బర్ - మధురవాయల్ రహదారి, సముద్రతీరాల్లో వంతెనల నిర్మాణం విషయంలోను ఆమె అదే ధోరణిని కనబరించారు. దీంతో జయలలిత కేంద్రాన్ని ఎదిరించడానికైనా వెనుకాడలేదన్న పేరు సంపాదించారు.
మారుతున్న రాజకీయం:
రజనీకాంత్.. కమల్ హాసన్.. విశాల్.. ఇలా సినీ ఇండస్ట్రీ నటులంతా ఇప్పడు రాజకీయాల వైపు చూస్తున్న పరిస్థితి. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆ స్థాయి నేత కరువవడంతో ఆ లోటును పూడ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మళ్లీ పుంజుకోవడానికి డీఎంకె గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇలాంటి తరుణంలో తమిళనాడు భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.