రామోజీ రావు, జగన్ భేటీ వెనక కెసిఆర్?
హైదరాబాద్: బద్ధశత్రువులుగా వ్యవహరించిన ఈనాడు అధినేత రామోజీ రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నదా అనే ప్రశ్నకు తావు కల్పిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రామోజీ ఫిల్మ్సిటీకి వెళ్లి ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావును కలిశారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది.
వారిద్దరి భేటీ వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తొలిసారిగా రామోజీ రావు సచివాలయంలో అడుగు పెట్టింది కెసిఆర్ను కలవడానికే. ఆయన కెసిఆర్ను కలిసి సత్సంబంధాలను నెలకొలుపుకున్నారు. కెసిఆర్ రామోజీ ఫిలిం సిటీకి కూడా వెళ్లారు. రామోజీ ఫిలిం సిటీకి ఆయన కితాబు ఇచ్చారు. ఈ స్థితిలో జగన్, రామోజీరావుల మధ్య స్నేహానికి కెసిఆర్ మధ్యవర్తిత్వం నెరిపారనే మాట వినిపిస్తోంది.

జగన్ వెంట తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, వైసీపీ ప్రముఖుడు విజయసాయిరెడ్డితోపాటు మరో ఇద్దరు రాయలసీమ శాసనసభ్యులు కూడా ఉన్నారు. రామోజీరావు, జగన్మోహన్రెడ్డిల నడుమ ఈ సందర్భంగా సుదీర్ఘ మంతనాలు జరిగినట్టు సమాచారం. ఈ భేటీ మర్యాదపూర్వకమైనదేనని బయటికి చెబుతున్నా భేటీ సమాచారం టీడీపీ, వైసీపీ, మీడియావర్గాల్లో రేపుతోంది.
తెలుగుదేశం శిబిరానికి ఈనాడు రామోజీరావు రాజగురువు పాత్ర పోషిస్తున్నారనీ, ఉద్దేశపూర్వకంగా తమపై కక్షపూరిత రాతలు రాస్తూ కుట్రలకు పాల్పడుతున్నారనీ దివంగత నేత వైఎస్రాజశేఖర్రెడ్డి సహా జగన్మోహన్రెడ్డి, సాక్షి పత్రిక, సాక్షి టీవీ, వైసీపీ అనేకసార్లు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈనాడు గ్రూపు, సాక్షి గ్రూపుల నడుమ అక్షరాలా ఓ యుద్ధమే సాగింది. ఇటువంటి శత్రుత్వం కొనసాగించిన జగన్ అకస్మాత్తుగా రామోజీతో ఎందుకు చేతులు కలపాలనే నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల నటుడు మోహన్బాబు ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో రామోజీరావు, జగన్ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు ఆసక్తిని రేకెత్తించాయి. తరువాత రెండు గ్రూపుల ముఖ్యుల నడుమ సంబంధాలు బాగా మెరుగుపడినట్టు చెబుతున్నారు. జగన్, రామోజీ కుటుంబసభ్యుల నడుమ కూడా కొంతకాలంగా వైరభావన తగ్గి, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఈ స్థితిలో ఈ ఇద్దరి భేటీ దేనికి సంకేతమనే చర్చ ఇప్పుడు మొదలైంది.
నీకు చాలా భవిష్యత్తు ఉంది, ఆవేశం తగ్గించుకో అంటూ రామోజీ సలహా ఇచ్చారనీ, మీ సహకారం కావాలి అని జగన్ ఆయన్ని కోరారనీ తెలుస్తున్నది. ఈ వ్యాఖ్యల అంతరార్థాలపై ఇప్పుడు చర్చ సాగుతున్నది. ఈనెల 26న జగన్మోహన్రెడ్డి రాష్ర్టానికి ప్రత్యేక హోదాపై ఆమరణదీక్షకు సంకల్పించారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ స్థితిలో చంద్రబాబు వైఖరి వారిద్దరి భేటీపై ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.












Click it and Unblock the Notifications