కెసిఆర్ నెత్తిన కుంపటి: ఆదివాసీల పోరు, ఎస్టీ కోటాపై ఎలా..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు, లంబాడాలకు మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సెగ హైదరాబాదుకు కూడా పాకింది.
ఎస్టీ రిజర్వేషన్ల ఫలితాలను లంబాడాలే కొట్టుకుపోతున్నారని ఆదివాసీలు విమర్శిస్తున్నారు. దాంతో ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరిగిన పోరు దశాబ్దాలుగా నడిచినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కెసిఆర్ ఆలోచన ఇలా ఉంది...
ఆదివాసీలకు, లంబాడాలకు మధ్య ఘర్షణలను నివారించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు యోచన చేస్తున్నట్లు వినికిడి. ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసిన తర్వాత ఎస్టీ ప్రజా ప్రతినిదులతోనూ సామాజిక రంగంలోని నాయకులతోనూ సమావేశం కావాలని ఆయన అనుకుంటున్నారు. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే యోచనను ఆయన వారి ముందు పెట్టే అవకాశం ఉంది.
కమిషన్ ఏర్పాటు చేయాలని...
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి కెసిఆర్ ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తారని అంటున్నారు. నివేదిక సమర్పించడానికి ఆరు నెలల గడువు విధించాలని కూడా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆదివాసీలకు, లంబాడాలకు మధ్య చెలరేగుతున్న వివాదాన్ని, ఘర్షణలను నివారించవచ్చుననేది ఆయన ఆలోచన.
ఎస్సీ రిజర్వేషన్లపై ఇలా...
ప్రస్తుతం బిసీ రిజర్వేషన్లలో ఐదు కెటగిరీలున్నాయి. ఎ,బి,సి,డి, ఈ కెటగిరీలుగా విభజించారు. 29 శాతం రిజర్వేషన్లను ఆ కెటగిరీల మధ్య పంచుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ఇంకా పెండింగులోనే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కోరుతూ తెలంగాణ శానససభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అది అమలు చేయాలని కోరడానికి అఖిల పక్ష బృందంతో కెసిఆర్ ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం...
ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం. అయితే, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తాము చేపట్టాల్సిన చర్యలను పూర్తి చేసి, ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కెసిఆర్ భావిస్తున్నారు. తద్వారా తాము చేయాల్సిందంతా చేశామని, కేంద్రం దానికి ఆమోదం చెప్పాల్సి ఉందని కమ్యూనిటీ నేతలకు కెసిఆర్ చెప్పే అవకాశం ఉంది. ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలపై కెసిఆర్ శనివారంనాడు మంత్రులు జోగు రామన్న, ఎ ఇంద్రకరణ్ రెడ్డి, చందూలాల్లతో సమావేశమై చర్చించారు.
లంబాడాలపై ఆదివాసీల వాదన ఇదీ...
అదివాసీలకు, లంబాడాలకు మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలనే విషయంపై కెసిఆర్ కమ్యూనిటీ నేతలతోనే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎస్టీల్లో 35 కులాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి లంబాడాలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చారని, వారిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ఆదివాసీలు వాదిస్తున్నారు. లంబాడాలు రిజర్వేషన్లను కొట్టుకుపోతున్నారని, దానివల్ల ఇతర కులాలకు అన్యాయం జరుగుతోందని వారంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లో బీసిలు, ఓబిసిలుగా...
ఇతర రాష్ట్రాల్లో లంబాడాలు బీసీ, ఓబిసీలుగా పరిగణనలో ఉన్నారని, ఎస్టీ హోదా పొందడానికి వారు తెలంగాణకు వలస వస్తున్నారని కూడా ఆదివాసీలు వాదిస్తున్నారు. లంబాడాలకు ఎస్టీ సర్టిఫికెట్ జారీ చేయకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్ల కోటాను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించి, కేంద్రానికి పంపింది. అయితే, రిజర్వేషన్ల మొత్తం 50 శాతం దాటడంతో అది పెండింగులో ఉంది.