మంత్రివర్గంలో తలసాని: కెసిఆర్ ధీమా అదేనా?
హైదరాబాద్: తెలుగుదేశం సభ్యుడు అయినప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల వచ్చే సంక్షోభం గానీ సమస్య గానీ ఏదీ లేదనే కొత్త వాదన తెర మీదికి వచ్చింది. శాసనసభ్యుడు అయితే చాలు, ఏ పార్టీకి చెందినవారినైనా మంత్రివర్గంలో చేర్చుకోవచ్చుననే నిబంధన ఉన్నట్లు తాజాగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ధీమా అనే మాట వినిపిస్తోంది.
తలసానిని మంత్రివర్గంలో చేర్చుకోవడంపై తెలుగుదేశ పార్టీ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కెసిఆర్ గానీ మంత్రులు గానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు గానీ పెద్దగా మాట్లాడకపోవడానికి కారణం అదేనని అంటున్నారు. గవర్నర్ నరసింహన్కు కూడా ఆ విషయం తెలుసు కాబట్టే ప్రమాణ స్వీకారం చేయించి ఉండవచ్చుననే మాట వినిపిస్తోంది.
దాంతో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ కెసిఆర్ మంత్రివర్గంలో కొనసాగటాన్ని అధికార టిఆర్ఎస్ ముఖ్యులు పూర్తిగా సమర్థించుకుంటున్నారు. తలసాని రాజీనామాపై తాజా వివాదం నేపథ్యంలో వారు ఇప్పటివరకూ బహిరంగంగా స్పందించనప్పటికీ, అంతర్గతంగా మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని అంటున్నారు.
ఏ పార్టీ నుంచి గెలిచిన సభ్యుడినైనా మంత్రివర్గంలోకి తీసుకునే హక్కు, అధికారం ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాలు అనధికారికంగా మాట్లాడుతున్నారు ఇందుకు కేంద్రంలో ఎన్డీయే భాగస్వామి శివసేనకు చెందిన ఎంపీ సురేశ్ ప్రభును ఆ పార్టీ ఆమోదం లేకుండానే ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసానిని కేసీఆర్ తన కేబినెట్లోకి తీసుకోవటం తప్పు అయితే, కేంద్రంలో బీజేపీది కూడా తప్పే అవుతుందని అంటున్నారు.
తలసానిని కేబినెట్లో చేర్చుకోవటంపై టిడిపి, బిజెపిలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అటువంటప్పుడు కేంద్రంలో సురేశ్ప్రభు విషయంలో ఎందుకు అభ్యంతరాలు వ్యక్తంచేయటంలేదనే ప్రశ్న కూడా వారి నుంచి వస్తోంది. సింగపూర్లో ప్రతిపక్ష నేతను అక్కడి ప్రధాని తన కేబినెట్లోకి ఉదంతాన్ని కూడా టిఆర్ఎస్ నాయకులు ఉదహరిస్తున్నారు.
ముఖ్యమంత్రి తన పార్టీకి చెందిన వారినే కేబినెట్లోకి తీసుకోవాలని, వేరే పార్టీ నుంచి గెలిచిన వారిని చేర్చుకోవద్దనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదని అంటున్నారు. అందువల్ల తలసాని విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలో పస లేదని అంటున్నారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరో పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో చేరడమనేది, అలా చేర్చుకోవడమనేది అయితే గియితే నైతిక సమస్య అవుతుందే గానీ రాజ్యాంగపరమైన, చట్టపరమైన సమస్య కాదని అంటున్నారు.
కాగా, ఎమ్మెల్యే పదవికి తలసాని చేసిన రాజీనామాను ఆమోదించాలా? వద్దా? ఒకవేళ ఆమోదిస్తే అందుకు ఏ విధానాన్ని ఎంచుకోవాలి? ఎప్పుడు ఆమోదించాలి? అనే అంశాలు స్పీకర్ పరిధిలోకి వస్తాయని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. పైగా, అసెంబ్లీ స్పీకర్ను ఎవరూ నిర్దేశించలేని విధంగా, ఆయన అధికారాల్లో ఇతరులు జోక్యం చేసుకోలేని రీతిన చట్టాలున్నాయని అంటున్నారు.