2019 ఎన్నికలు: కేసీఆర్ గెలుపు మంత్రాలు ఇవే
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అప్పుడే వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. పలు ప్రజాకర్షక పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చూపించి ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరుకోవాలని అనుకుంటున్నారు.
కేసీఆర్ ఈ ఏడాది ప్రజాకర్షక పథకాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 40 వేల కోట్ల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్ని కులాలకు, మతాలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారు.
బీసీల కోసం ఇలా..
బీసీల్లో అతి దారుణంగా వెనకబడిన కులాలను గుర్తించడానికి కేసీఆర్ సర్వే జరిపిస్తున్నారు. ఆ సర్వే ఆధారంగా వారికి వేయి కోట్ల వరాలు ప్రకటించనున్నారు. గొల్లకురుమలకు ఇప్పటికే ఆయన గొర్రెల పంపకం పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది ఆయన పాల ఉత్పత్తిదారులకు రూ.85 వేల రూపాయలు ఇవ్వనున్నారు.
ముస్లిం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్
ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యలు అభ్యసించడానికి ముస్లిం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాదిరిగానే వారికి కూడా ఈ పథకం అమలు అవుతుంది. దానికితోడు ఆదాయ పరిమితిని ఆయన పెంచారు.
మిషన్ భగీరథ పూర్తి చేసి..
మిషన్ భగీరథ ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది 45 వేల కోట్ల ప్రాజెక్టు. ఈ పథకం ద్వారా జూన్ 2018 నాటికి అన్ని గృహాలకు కృష్ణా, గోదావరి నదుల ద్వారా మంచినీటిని అందించనున్నారు. మిషన్ భగీరథతో పాటు ఆప్టిక్ పైబర్ కేబుల్స్ కూడా వేస్తున్నారు. దీంతో 2018నాటికి అందరికీ బ్రాడ్బాండ్ కనెక్టివిటీ ఇస్తారు.
రైతులకు 24 గంటలు విద్యుత్తు
రైతులకు సోమవారం నుంచే 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది గంటలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని 3 లక్షల పంపు సెట్లకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా ఉంటుంది. దీనికి ఏడాదికి 5,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా.
రైతులకు రూ. 8 వేల చొప్పున
ఈ ఏడాది నుంచి రైులకు ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం డిపాజిట్ చేయనుంది. ఇది రెండు విడతల్లో జరుగుతుంది. మొదటి విడత 4 వేల రూపాయల చొప్పున ఖరీఫ్ కోసం మేలో డిపాజిట్ చేస్తారు. రెండో విడత రబీ కోసం నవంబరులో డిపాజిట్ చేస్తారు. దీనివల్ల 60 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.