అవిశ్వాసంపై ఎటు: బాబును వెయిటింగ్లో పెట్టిన కేసీఆర్
Recommended Video
హైదరాబాద్: బిజెపి, కాంగ్రెసు పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ కడుతానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి.
తెలుగుదేశం వర్గాల నుంచి ఆ వార్తలు అందాయి. అయితే, ఇప్పటి వరకు ఆ విషయంపై కేసీఆర్ ఏ విధమైన నిర్ణయం కూడా తీసుకోలేదు. ఆయన దాదాపుగా చంద్రబాబుకు వ్యతిరేకంగానే పనిచేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, టిఆర్ఎస్ నేతలు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.
వినోద్ కుమార్ ఇలా...
తాము అవిశ్వాసానికి వ్యతిరేకం గానీ అనుకూలం గానీ కాదని టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ చెప్పారు. రిజర్వేషన్ల సమస్యపై నిరసన తెలియజేయాలని తమ పార్టీ అధిష్టానం ఆదేశించడం వల్లనే తాము వెల్లోకి వెళ్తున్నామని ఆన చెప్పారు.
కేకే కుండబద్దలు కొట్టారు...
అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని మరో టిఆర్ఎస్ ఎంపీ కే.. కేశవరావు తేల్చి చెప్పారు. ఇది కేవలం రాజకీయ జిమ్మిక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు. అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించుకునేంత బలం వారికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసానికి కారణమే కనిపించడం లేదని అన్నారు.
కర్నె ప్రభాకర్ ఇలా చెప్పారు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్కు మద్దతు ఇస్తున్నామని చెబుతూనే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఎటువైపు ఓటు వేయాలనే విషయంపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వేచి చూసే ధోరణిలో కేసిఆర్
ఢిల్లీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న కేసిఆర్ తమ పార్టీ నాయకులను వెయిటింగ్లో పెట్టారు. ఆయన వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. చివరి క్షణంలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నేరుగా కేసీఆర్ను కోరుతారా అనేది కూడా వేచి చూడాల్సిందే. చంద్రబాబును ఆయన వెయిటింగ్లో పెట్టారు.