సోనియాతో కెసిఆర్ భేటీ: విలీనం దిశగా...?
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీలో విలీనం దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమైన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తాజాగా సోమవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచారు.
తెలంగాణ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోనియాను కెసిఆర్ కలవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం సాయంత్రం పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా సోనియాను కలిశారు. ఆ తర్వాతే ఆమెతో కెసిఆర్ భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం 5-6 గంటల మధ్య కెసిఆర్, తన తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావుతో కలిసి సోనియా నివాసమైన టెన్ జనపథ్కు వెళ్లినట్లు చెబుతున్నారు.
ఆమెతో వారిద్దరు దాదాపు 15 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెరాస నాయకులు మాత్రం ఆ సమావేశం జరగలేదని చెబుతున్నారు. సోనియాను కెసిఆర్ కలిసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. అయితే దిగ్విజయ్సింగ్ను కలిసిన సందర్భంగానే సోనియాతో కెసిఆర్ అపాయింట్మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్లో తెరాస విలీనం విషయమే సోనియాతో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. బిల్లు ఆమోదం పొందితే విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ విషయంలో మాట నిలబెట్టుకుంటామని కెసిఆర్ చెప్పినట్లు తెలిసింది. అయితే బిల్లు ఆమోదంపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బిజెపి అడ్డంకులు సృష్టిస్తోందని, అయినా బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని సోనియా అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా ఆ పార్టీలో తెరాస విలీనం లేదా పొత్తు ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.