నాడు షాకిచ్చారు! ఏపీలో కెసిఆర్ ఏం మాట్లాడ్తారు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్కు స్వాగతం ఎలా లభిస్తుంది? విజయవాడలో ఆయన ఏం మాట్లాడుతారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన అనంతరం కెసిఆర్ ఒకసారి తిరుపతి వెళ్లడం మినహా పద్నాలుగేళ్ల కాలంలో ఆంధ్రలో ఎక్కడికీ వెళ్లలేదు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో తెలంగాణ ఏర్పడడం వల్ల ఆంధ్ర ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో విజయవాడలో ప్రసంగించాలని కెసిఆర్ ప్రయత్నించారు.
బహిరంగ సభకు ఏర్పాట్లు అన్నీ చేసిన తర్వాత కొంతమంది కెసిఆర్ రాకను వ్యతిరేకిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఉద్యమ కాలంలో సాధ్యం కాలేదు అయితే ఇప్పుడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఆ కోణంలో వివరించేందుకు అవకాశముందని అంటున్నారు.
కెసిఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం వల్ల రెండు రాష్ట్రాలకు ప్రయోజనమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని చాలామంది భావిస్తున్నారు. ఉద్యమ కాలంలో ఉన్న వాతావరణం వేరు, ఇప్పుడు రెండు రాష్ట్రాలు అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలి కానీ ఘర్షణ పూర్తి వాతావరణం ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదంటున్నారు.
ఇప్పటికే కెసిఆర్కు బెజవాడలో స్థానిక టిడిపి నేతలు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తదితరులతో పాటు కెసిఆర్కు కూడా బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఇది సాధారణమే అయినప్పటికీ.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో చర్చనీయాంశమైంది.
కెసిఆర్ రాకను ఏపీ ప్రజలు ఎలా స్వాగతిస్తారు? టిడిపి నేతలు, విపక్షాలు ఎలా స్వాగతిస్తాయి? అలాగే చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కెసిఆర్ ఏం మాట్లాడుతారు? అసలు మాట్లాడుతారా? అనే చర్చ సాగుతోంది.