జిహెచ్ఎంసి ఎన్నికలకు కెసిఆర్ పక్కా ప్లాన్
హైదరాబాద్: గ్రేటర్ హైదారాబద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో విజయానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నారు. మేయర్ పీఠమే లక్ష్యంగా సమీకరణలకు ఆయన పూనుకున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలను నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
అదే సమయంలో వివిధ రాజకీయపార్టీలు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో టిఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు రాజకీయ సమీకరణలు చేస్తూనే, మరో వైపు మహానగర ప్రజలకు వరాల జల్లు కురిపిస్తోంది. దీర్ఘకాలంగా నగరాన్ని పట్టి పీడిస్తున్న మంచినీటి సమస్యను అధిగమించేందుకు గోదావరి జలాలను తెచ్చే పనిని వేగవంతం చేసింది. దీనికి తోడు రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్లు, డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణం వంటి పనులను ముమ్మరం చేసింది.
రాజకీయంగా, అభివృద్ధి పరంగా టిఆర్ఎస్ వేర్వేరుగా పక్కా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఆరుగురు మాజీ కార్పొరేటర్లు సైతం ఎన్నికల్లోపు పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
దీంతో నగరంలో క్యాడర్ లేని పార్టీగా ముద్రపడ్డ టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగనుంది. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల తర్వాత టిఆర్ఎస్ పార్టీ స్థితిగతులపై ఆ పార్టీ సొంతగా చేసిన సర్వేలో నగరంలోని మొత్తం 150 డివిజన్లలో 84 సీట్లు గెలిచే అవకాశాలున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. ఈ నివేదికలను నిజం చేసేందుకు గ్రేటర్లోని డివిజన్లకు ఎమ్మెల్యేలు, మంత్రులను ఇన్ఛార్జిలుగా నియమించాలని ఆ పార్టీ అధినాయకులు భావిస్తున్నారు.
ఇందుకు సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తెరాస సింగిల్ పార్టీగా పోటీ చేసినా 84 సీట్లు గెలవటం ఖాయమన్న నివేదికలు రావటంతో ఆ పార్టీ నేతలు ఏ పార్టీలతోనూ పొత్తులుండవన్న ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ముందు జాగ్రత్తగా మజ్లిస్ పార్టీతో రహస్యంగా, లోపాయికారిగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.